Chandrababu-Pawan Kalyan: అలక వీడిన పవన్? లోకేష్ యాత్ర ముగింపు సభకు-ఒకే వేదికపై బాబుతో..
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు టీడీపీ, జనసేన ఉమ్మడిగా పనిచేసే విషయంలో పొరపొచ్చాలు వచ్చాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఎల్లుండి జరిగే నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ కీలకంగా మారింది.
ఈ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ సభకు రావాల్సిందిగా నిన్న చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి మరీ కోరడంతో ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవాళ్టితో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర 226 రోజుల్లో 3,132 కి.మీ.దూరం పూర్తి చేసుకుని ముగియబోతోంది. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన పాదయాత్ర ఇవాళ విశాఖ శివాజీ నగర్ లో ముగియనుంది. అనంతరం ఈ నెల 20న భోగాపురం సమీపంలో పోతేపల్లి లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ హాజరు కావాల్సి ఉంది.
అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకాల్లో ప్రతిష్టంభన నెలకొంది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం జనసేనకు కేవలం 15 సీట్లు ఇవ్వాలని భావించినట్లు సమాచారం. దీంతో అప్పటికే దాదాపు 30 సీట్లపై అంచనాలు వేసుకున్న పవన్ కళ్యాణ్ అలిగారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రావట్లేదని తేల్చిచెప్పేశారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ సభకు పవన్ రావడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో పవన్ హాజరుకారనే అంతా భావించారు.
కానీ చివరికి చంద్రబాబు నిన్న అనూహ్యంగా హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లడం, అక్కడ ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరపడంతో పరిస్ధితి మారింది. జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య కూడా పెరిగినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం జనసేనకు ఈసారి 24 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కూడా కాస్త మెత్తపడ్డారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇవాళ పవన్ హాజరుపై ప్రకటన చేసింది.












Click it and Unblock the Notifications