రఘురామ ఫిర్యాదుపై చంద్రబాబు యాక్షన్-మాజీ ఇంటెల్ ఛీఫ్ సునీల్ పై చర్యలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టడీ హింస వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. దీనికి కారణం తనపై జరిగిన దాడిపై రఘురామ రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరం పాలెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియా ఆధారంగా చేసిన వ్యాఖ్యలపై సర్కార్ చర్యలకు దిగింది.
రఘురామరాజు ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసుపై పీవీ సునీల్ కుమార్ స్పందిస్తూ గతంలో ఆధారాలు లేవని సుప్రీంకోర్టు కొట్టేసిన కేసుపై మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన కింద ఆయనపై అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లో లిఖితపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది.

అలాగే ప్రభుత్వానికి సమాధానం ఇచ్చే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ప్రభుత్వం పీవీ సునీల్ కుమార్ ను హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలపై ప్రభుత్వానికి ఏ వివరణ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన్ను కూటమి సర్కార్ బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. ఇప్పుడు అభియోగాలు నిజమని తేలితే ఏ చర్యలు తీసుకోబోందన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications