అమరావతిని అలా చేస్తాను, అది కలిసి వస్తుంది: ఢిల్లీలో చంద్రబాబు
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు, సైబరాబాదును అభివృద్ధి చేసినట్లుగానే తాను నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచం గర్వించదగ్గ కేపిటల్గా తీర్చిదిద్దుతానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.
సీఐఐ ఆధ్వర్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. అంతర్జాతీయస్థాయిలో నిర్మించబోతున్న అమరావతి నగరానికి కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉన్నాయన్నారు.
రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని తెలిపారు. పరిపాలన, ఆర్థిక రాజధానిగా అమరావతి నిలవబోతోందని స్పష్టం చేశారు. సుమారు 40-50 కిలోమీటర్ల మేర నదీతీరం ఉండటం అమరావతికి కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.
కాగా, ఏపీలో ఈ అక్టోబర్ చివరికల్లా ఇన్సూరెన్స్ పరిహారం రైతులకు అందేలా శ్రద్ధ వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్రాప్ కటింగ్ ఎక్స్పరిమెంట్లు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. 37,600 హెక్టార్లలో పంటలు భారీ వర్షాలు, వరదలవల్ల దెబ్బతిన్నాయని, 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించి మళ్లీ పంటల సాగుకు దోహదపడాలన్నారు.
నాసిరకం విత్తనాలు, బోగస్ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో జరిగింది మళ్లీ ఎక్కడా ఎప్పుడూ పునరావృతం కారాదన్నారు. ఏమాత్రం ఉపేక్షించవద్దని, అవసరమైతే పీడీ యాక్ట్ ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు.