సీఎం రమేష్పై వరదరాజులురెడ్డి తీవ్రవ్యాఖ్యలు: కడప గొడవపై చంద్రబాబు సీరియస్
కడప: కడప జిల్లాలో ప్రొద్దుటూరు పార్టీ ఇంచార్జ్ వరదరాజులు రెడ్డి, టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మధ్య వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రంగంలోకి దిగారు. కడప నేతలతో ఆయన భేటీ అయ్యారు.
కడప టీడీపీలో చిచ్చు: జగన్తో టచ్లో సీఎం రమేష్.. వరదరాజులురెడ్డి సంచలనం, కారణమిదేనా?
చంద్రబాబుకు గొడవ వివరించిన సోమిరెడ్డి
ఈ భేటీలో వరదరాజులు రెడ్డి, సీఎం రమేష్ వివాదం అంశాలను సీఎం చంద్రబాబుకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు. నేతల మధ్య ఈ తరహా విభేదాలు సరికాదని అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారు. కలిసి పని చేసుకోకుండా ఈ గొడవలు ఏమిటీ, ఈ తలనొప్పి ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
వరదరాజులు రెడ్డి వ్యాఖ్యలు తప్పుబట్టిన చంద్రబాబు
రెండు రోజుల క్రితం సీఎం రమేష్ పైన వరదరాజులు రెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. పార్టీలో ఓ సీనియర్ నేత గురించి కామెంట్లు చేయడం ఎంత వరకు సమంజసం అని చంద్రబాబు ప్రశ్నించారు. కడపలో నేతల మధ్య విభేదాల నేపథ్యంలో వారితో విడివిడిగాను, కలిసి ఆయన భేటీ నిర్వహించారు.
చంద్రబాబుతో భేటీలో నేతలు
చంద్రబాబుతో భేటీలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా నేతలు పాల్గొన్నారు. ఇటీవల ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎం రమేష్పై వరదరాజులురెడ్డి విరుచుకుపడ్డారు. జిల్లాలో రమేష్ గ్రూపు రాజకీయాలు నడుపుతూ చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడలేని ఆయన పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ అని ఎద్దేవా చేశారు.
కడప జిల్లా టీడీపీలో విభేదాలు
కడప జిల్లాలో బద్వేలు, కోడూరు, రాజంపేట, కడప, కమలాపురం, రాయచోటి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తూ గెలిచే సీట్లను కూడా పోగొ ట్టేందుకు కుట్ర పన్నుతున్నాడన్నారని రమేష్పై వరదరాజులు రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఆదికి రామసుబ్బారెడ్డి హెచ్చరిక
మరోవైపు, జమ్మలమడుగు టీడీపీలోను విభేదాలు వెలుగు చూశాయి. టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్సీ రామసుబ్బా రెడ్డి వర్గీయులపై మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడికి దిగిన విషయం తెలిసిందే. మంత్రి వర్గీయులది నీచసంస్కృతి, తమ అనుచరులపై అన్యాయంగా దాడి చేశారని, ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక నుంచి జరిగేది వేరని, ఇకపై తన అనుచరుల మీద దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆదినారాయణ రెడ్డిని రామసుబ్బారెడ్డి హెచ్చరించారు.