'చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్.. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదు'
ఇప్పటినుంచి చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైందని, రానున్న రోజుల్లో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు.
విజయవాడ: ప్రచార ఆర్భాటాలను, ఊకదంపుడు ఉపన్యాసాలను పక్కనబెట్టి ఇచ్చిన హామిలను నెరవేర్చాలని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. ఇప్పటినుంచి చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైందని, రానున్న రోజుల్లో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు.
నిరుద్యోగ భృతిపై తమ పార్టీ అధినేత జగన్ రాసిన బహిరంగ లేఖకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామిలను ఏ మేరకు నెరవేర్చారో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ప్రతిపక్ష నాయకుడిపై అవాకులు చవాకులు పేలడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
ప్రచార ఆర్భాటం తప్ప టీడీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. ఎమ్మెల్యే రోజాకు జరిగిన అవమానం పట్ల ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని, దాన్ని పోలీసులు సమర్థించుకోవడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోవాలని హితవు పలికారు.