తాగునీరు, నీడ కూడా కల్పించలేరా?: తిరుమలలో భక్తుల ఇబ్బందులపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం భక్తులు పడుతున్న కష్టాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టీటీడీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. భక్తులకు తాగునీరు, క్యూలైన్లలో నీడ ఉండేలా కూడా చూడలేరా? అని నిలదీశారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు ఆగ్రహం
తిరుమల కొండపైకి వెళ్లేందుకూ ఆంక్షలు విధించడమంటే.. భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయాలు భక్తులకు శ్రీవారిని దూరం చేసేలా ఉన్నాయని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దర్శనాలు, వసతి వంటి అంశాల్లో మొదటి నుంచి ఇదే తరహా అలసత్వం టీటీడీలో కనిపిస్తోందన్నారు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణంలోనే టీటీడీ చూస్తోందని విమర్శించారు. భక్తులకు టీటీడీ క్షమాపణలు చెప్పి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట
కాగా, తిరుపతిలో భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తిరుమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద టోకెన్లు తీసుకోవడానికి భక్తులు వేచి ఉన్నారు. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లోనే నిలిచారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు భక్తులు పడిపోవడం, ఎటూ వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల రద్దీని టీటీడీ అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
టోకెన్లు లేకుండానే దర్శనాలకు అనుమతి.. తగ్గని భక్తుల రద్దీ
మరోవైపు, తిరుపతి బస్టాండు వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దర్శనానికి ఎలాంటి టోకెన్లు అవసరం లేదని టీటీడీ ప్రకటన చేసింది. దీంతో తిరుమల కొండపైకి వెళ్లేందుకు బస్టాండుకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. బస్సులు ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. వాహనాలతో వెళ్లే వారు అలిపిరి కేంద్రం గుండా వెళుతున్నారు. దీంతో తనిఖీ కేంద్రం వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ఉండలేక వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.