కర్నూల్లో నిరసనలపై చంద్రబాబు ఫైర్- నేను రౌడీలకు రౌడీని.. గూండాలకు గూండాని..
కర్నూల్లో మూడు రాజధానుల కోసం ఉద్యమిస్తున్న లాయర్లు, వైసీపీ కార్యకర్తలు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ కార్యాలయం వద్దే అడ్డుకున్నారు. మూడు రాజధానులకు మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుపడొద్దని కోరారు. ఈ మేరకు కేంద్రం, సీఎం జగన్ కు లేఖ రాయాలని కూడా కోరారు. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
తనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన వారిపై కర్నూల్లో చంద్రబాబు ఫైర్ అయ్యారు. తాను రౌడీలకు రౌడీనని .. గూండాలకు గూండానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ప్రజలకు తప్ప మరెవ్వరికీ భయపడబోనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. తనను రెచ్చగొట్టిన వాళ్ల పతనం ఖాయమన్నారు. వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోవాలంటూ చంద్రబాబు కర్నూల్లో వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ పైనా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ తనపైనే దాడి చేయాలనుకుంటోందని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు తాను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో అమరావతిని రాజధాని చేస్తామంటే జగన్ గతంలో ఒప్పుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు మాటమార్చి మూడురాజధానుల పేరుతో చిచ్చుపెడుతున్నారని విమర్శించారు.