చంద్రబాబు సర్వే: బాలయ్య టాప్, మంత్రులకు ప్రమాద ఘంటికలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రుల విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో మంత్రుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. తమ తమ నియోజకవర్గాల్లో మంత్రుల పనితీరు శాసనసభ్యుల పనితీరు కన్నా ఏ మాత్రం మెరుగ్గా లేదని సర్వేలో తేలినట్లు సమాచారం.
సంక్షేమ పథకాల అమలులో మంత్రుల నియోజకవర్గాలు దిగదుడుపుగానే ఉన్నాయని సర్వే ఫలితాలు తేల్చినట్లు చెబుతున్నారు. ప్రతి శాసనసభా నియోజకవర్గంలో 150 నుంచి 200 మందిని తీసుకుని సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పది జిల్లాల్లోనూ ఈ సర్వే జరిగినట్లు సమాచారం.
సర్వే ఫలితాలు కొంత మంది మంత్రులకు పదవీ గండం తెచ్చి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కీలకమైన మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావు, కె. అచ్చెన్నాయుడుల పరిస్థితి కూడా ఏ మాత్రం బాగా లేదని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దేవినేని ఉమ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసినట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్ర రెండో స్థానంలో నిలువగా, ఉమ ఏడో స్థానంలో నిలిచినట్లు సమాచారం. జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం తాతయ్య అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లాలో మాజీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి మంత్రి పత్తిపాటి పుల్లారావు కన్నా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన రావెల కిశోర్ బాబు పదో స్థానంలో ఆరో స్తానంలో నిలిచిన పత్తిపాటి పుల్లారావు కన్నా మెరుగ్గా పనిచేస్తున్నట్లు తేలిందని అంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మంది శాసనసభ్యుల్లో మంత్రి పీతల సుజాత 13వ స్థానం పొందారు. శ్రీకాకుళం జిల్లాలో శాసనసభ్యురాలు లక్ష్మీదేవి అగ్రస్తానంలో నిలిచారు. కర్నూలు జిల్లాలో బనగానపల్లె శాసనసబ్యుడు బిసి జనార్దన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. ప్రకాశం జిల్లాలో పరుచూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివ రావు అగ్రస్తానంలో నిలిచారు.
అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడి బావమరిది నందమూరి బాలకృష్ణ అగ్రస్థానంలో నిలిచారు. ఈ రకంగా చూస్తే మంత్రుల కన్నా శాసనసభ్యుల పనితీరు బాగున్నట్లు అర్తమవుతోంది. దీంతో కొంత మంది మంత్రులకు ఉద్వాసన తప్పదా అనే చర్చ తెలుగుదేశం పార్టీలో సాగుతోంది.