ఒక్కరొక్కరిగా..: పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులకు క్లాస్ తీసుకుంటున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నాటికి పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో మరింత బలం పుంజుకునేలా చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. తన సర్వేలో ఎమ్మెల్యేల పరంగా ఉన్న లోపాలను ఎత్తిచూపి వాటిని దిద్దుకోవాలని సూచించారు. కొంతకాలంగా ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు.
శనివారం కూడా పలువురు ఎమ్మెల్యేలతో బాబు విడివిడిగా భేటీ అయ్యారు. పని తీరు మార్చుకోవాలని, నియోజకవర్గంలో సమన్వయం పెంచుకోవాలని, ఎన్నికలకు ఇంకా కేవలం రెండు నెలల వ్యవధి మాత్రమే ఉందని, కష్టపడి పని చేయాలని సూచించారు. ఒక్కో ఎమ్మెల్యేతో మాట్లాడి నియోజకవర్గంలో బలాలు, బలహీనతలు వివరించారు. బిజెపితో పొత్తు ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు ఈ సమావేశంలో సూచనప్రాయంగా వెల్లడించినట్టు తెలుస్తోంది.
విభజన అంశం ముగింపు ఏ విధంగా ఉన్నా రెండు ప్రాంతాల్లో బలంగా ఉన్న ఏకైక పార్టీ టిడిపి మాత్రమేనని బాబు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం తగ్గుతోందని, తెలంగాణలో ఆ పార్టీకి ఉనికే లేదని బాబు వివరించారు. విభజన అంశంతో సీమాంధ్రలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని, రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అన్నారు. విభజన రాజకీయాల వల్ల విలువైన సమయం వృధా అయిందనే అభిప్రాయం ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు.
బిసిలకు వంద సీట్లు ఇవ్వాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు. టిడిపి గతంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కోందని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా టిడిపి వాటిని ఎదుర్కొంటుందని బాబు భరోసా ఇచ్చారని ఎమ్మెల్యేలు తెలిపారు. తిరిగి టిడిపి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు.