రాజధాని: వికేంద్రీకరణలో కర్నూలుకు ప్రాధాన్యత ఎంత?
విజయవాడ: మద్రాసు రాష్ట్రం వేరుపడినపుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా వెలుగొందిన కర్నూలు భవిష్యత్తు ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. ఆంధ్ర, తెలంగాణను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన సమయంలో రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాదుకు తరలించారు. అప్పటి నుంచి కర్నూలు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పవచ్చు. తాజాగా జరిగిన రాష్ట్ర విభజనతో మరింత వెనుకబడే పరిస్థితులు నెలకొన్నాయి.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును చేయాలన్న ప్రజల డిమాండ్ నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. విజయవాడ - గుంటూరు నగరాలను కలుపుతూ కొత్త రాజధానిని నిర్మించే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని రాదని తేలిపోవడంతో ఇక కర్నూలు అభివృద్ధి కోసం తీసుకునే చర్యలేంటన్న అంశం తెర పైకి వచ్చింది.
గతంలో అభివృద్ధి విషయంలో ఒక్క హైదరాబాదుపై దృష్టి సారించి జరిగిన తప్పు మళ్లీ జరుగకూడదన్న ఉద్దేశ్యంతో ఉన్నామని ముఖ్యమంత్రి పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నింటినీ సమానాభివృద్ధి చేసే దిశగా భవిష్యత్ అడుగులు వేస్తామన్నారు. ఆయన చెప్పినట్లుగా రాయలసీమలో ప్రధాన పట్టణంగా కర్నూలును ఎంపిక చేస్తారా లేదంటే మరో పట్టణానికి వనరులు సమకూరుస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. తిరుపతి తర్వాత చంద్రబాబు దృష్టి అనంతపురం పైన పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నింటిని సమాన అభివృద్ధి చేస్తామని చెప్పినందువల్ల కర్నూలు అభివృద్ధికి నోచుకుంటుందని చెబుతున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చని ఎన్నికల అనంతరం వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని తేలిపోవడంతో ఇప్పట్లో హైకోర్టు విభజన ఉండదని భావిస్తున్నారు. కర్నూలు ప్రాంతంలోని సహజ వనరులను వినియోగించి భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వస్తే ఎంతో కొంత అభివృద్ధి పర్చే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications