చంద్రబాబు రిమాండ్ 19 వరకూ పొడిగింపు-తేలని బెయిల్, కస్టడీ వ్యవహారం..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ఇప్పటికే దాదాపు నెల రోజులుగా రిమాండ్ పై రాజమండ్రి జైల్లో ఉంటున్న చంద్రబాబు రిమాండ్ ను 15 రోజుల పాటు పొడిగించాలని సీఐడీ ఇవాళ మెమో దాఖలు చేసింది. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచే వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపర్చారు. అనంతరం రిమాండ్ ను ఈ నెల 19 వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఇవాళ వాడీవేడిగా వాదనలు సాగాయి. సీఐడీ తరఫున హాజరైన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే ఘాటుగా తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు కస్టడీకి తగిన కారణాలు ఉన్నాయని పొన్నవోలు వాదించగా.. రాజకీయ కారణాలతోనే మరోసారి కస్టడీ అడుతున్నారని దూబే ఆరోపించారు.

స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రను నిర్ధారించేలా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టుకు తెలిపారు. అలాగే చంద్రబాబు ఈ స్కాంకు కర్త, కర్మ, క్రియ అన్నారు. స్కిల్ స్కాంలో చేతులు మారిన రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లినట్లు నిరూపించే ఆధారాల్ని ఆయన ఇవాళ కోర్టుకు సమర్పించారు. ఈ సమయంలో కస్టడీకి ఇస్తేనే మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయని పొన్నవోలు వాదించారు.
కానీ చంద్రబాబును రాజకీయ కక్షతోనే జైల్లో ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన లాయర్ ప్రమోద్ దూబే వాదించారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఒక్కరే తీసుకున్నట్లు చెప్పడం సరికాదన్నారు. అసలు స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధమే లేదని, డిజైన్ టెక్ సంస్ధతో ఇతర సంస్ధలు ఒప్పందాలు చేసుకున్నాయని, చంద్రబాబు కేవలం సీఎంగా మాత్రమే సంతకాలు చేశారన్నారు. స్కిల్ కార్పోరేషన్ ద్వారా 2 లక్షల మందికి శిక్షణ లభించిందని, అంతా ఓపెన్ గానే జరిగిందని, ఇందులో స్కామ్ ఎక్కడుందని ప్రశ్నించారు. అనంతరం బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications