నెల్లూరులో బాబు, అమరావతి తప్ప వద్దా, మరో విభజన ఉద్యమం: బైరెడ్డి హెచ్చరిక
నెల్లూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీ పనులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
కండలేరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పొదలకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వాతావరణ సమతుల్యం కాపాడేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు 500 టీఎంసీల నీటి కొరత ఉందన్నారు.
నీరు అందరికీ ప్రాణధారం అని, నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నీరు - చెట్టు కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ ఏడాది 1800 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోయాయన్నారు. ఆరు నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి, దేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు.
కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తే ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో కరవు ఉండదన్నారు. వాతావరణ సమతుల్యం కోల్పోయి వర్షాభావ పరిస్థితి నెలకొందన్నారు.
భూగర్భ జలాల పెంపు, నదుల అనుసంధానం, సమర్థవంతంగా నీటి వినియోగం వల్ల కరవు పరిస్థితులు ఉండవన్నారు. కృష్ణా - పెన్నాలు అనుసంధానం చేస్తే నెల్లూరు జిల్లాకు నీటి కష్టాలు ఉండవన్నారు. ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. రాజకీయ విభజన జరిగిందన్నారు. విభజనతో మనం లోటు బడ్జెట్లో ఉన్నామని చెప్పారు.
ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: బైరెడ్డి
రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి విజయవాడలో అన్న్ారు. 192 కరువు మండలాల్లో 152 రాయలసీమలోనే ఉన్నాయన్నారు.
అమరావతి మినహా ఇతర ప్రాంతాల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని బైరెడ్డి అన్నారు. మరో విభజన ఉద్యమాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని హెచ్చరించారు.
కాగా, అమరావతిలో హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ భోసలే, మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన జస్టిస్ సిటీ ప్రాంతాన్ని న్యాయమూర్తులు పరిశీలిస్తారు. సాయంత్రం సీఆర్డీఏ అధికారులతో భేటీ అవుతారు.