సీఎం జగన్ కంచుకోటల్లో ''పసుపు కళ!''
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా తన పార్టీ ప్లీనరీని గుంటూరు-విజయవాడ మధ్య నిర్వహించారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాయలసీమలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. కానీ మూడు సంవత్సరాలకే పరిస్థితి మారిపోయిందని భావిస్తున్న చంద్రబాబు ముందుగా రాయలసీమపైనే దృష్టిసారించారు.

రాయలసీమలో చంద్రబాబుకు బ్రహ్మరథం?
ముందుగా 'బాదుడే బాదుడు' పేరుతో ఒకసారి పర్యటన పూర్తిచేసుకున్నారు. అప్పుడు విశేషమైన స్పందన వచ్చింది. 'మహానాడు' తర్వాత తాజాగా మళ్లీ రాయలసీమ జిల్లాల్లోని మదనపల్లి, నగరి, కార్వేటి నగరం, తంబళ్లపల్లి, రాజంపేట తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రతిచోట ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయన ప్రసంగానికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలకు ప్రజలు అనూహ్యంగా స్పందిస్తున్నారని, వారిలో ప్రభుత్వంపై నిగూఢంగా నెలకొన్న వ్యతిరేకతను చూపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాయలసీమ మొత్తం వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో బాబు
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా కుప్పం నుంచి చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబునాయుడు షాక్ ఇస్తున్నారు. మొత్తం రాయలసీమలోనే వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో పర్యటనలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భారీగా ప్రజాస్పందన ఉండటం, భారీ వర్షాలు కురుస్తున్నా లెక్కచేయకుండా తరలిరావడం వైసీపీ నాయకులను ఆలోచనలో పడేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ప్రతిచోటా విజయం సాధిస్తూ వచ్చిన వైసీపీకి ఈసారి ఎన్నికలు ఎదుర్కోవడం సులువని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అదంతా రివర్స్ లో కనిపిస్తోందంటూ వాపోతున్నారు.

మాటల తూటాలు పేలుస్తున్న చంద్రబాబు
వైసీపీ ప్లీనరీలో పార్టీ నేతలంతా తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై ఎప్పుడూ చేసే విమర్శలే గుప్పిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఈసారి తన పంథా మార్చారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. తల్లిని, చెల్లిని పంపేశాడని, పార్టీకి ఎన్నికలుండవని, ఆయనే శాశ్వత అధ్యక్షుడని, ఇదేం ప్రజాస్వామ్యమని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. రాయలసీమపై చంద్రబాబు ముందుగా ఫోకస్ చేయడం సరైనదేననేదానికి రుజువే పులివెందులలో భారీ భద్రత మధ్య జగన్ పర్యటించడమని, ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications