బాబు ఆ హెచ్చరిక జగన్ 'సాక్షి'కేనా: హైద్రాబాద్లో కూర్చోవడం కాదు: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు మీడియాకు హెచ్చరికలు జారీ చేశారు! శాసన మండలిలో చంద్రబాబు మాట్లాడుతూ... మీడియా బాధ్యతారాహిత్యంగా కథనాలు రాస్తే నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ హెచ్చరిక జగన్కు చెందిన సాక్షికి అని అభిప్రాయపడుతున్నారు.
జూన్ 1 నుంచి రాజధాని నుంచి కార్యకలాపాలు: యనమల
వచ్చే ఏడాది జూన్ 1 తేదీ నుంచి రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభవుతాయని మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం చెప్పారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఉంటుందన్నారు.

ఉద్యోగులకు సౌకర్యాల కల్పన పైన ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల రాకతో రాజధాని ఇమేజ్ మరింత పెరుగుతుందన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాదులో కూర్చోవడం ప్రభుత్వం లక్ష్యం కాదని చెప్పారు.
రోజా ప్రవర్తన చూసి మహిళలు సిగ్గుపడుతున్నారు: రావెల
రోజా ప్రవర్తన చూసి మహిళలు అంతా బాధపడుతున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. రోజా సస్పెన్షన్ పైన వైసిపి అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. వైసిపి లాంటి ప్రతిపక్షం ప్రపంచలో ఎక్కడా లేదన్నారు. సమస్యల పైన చర్చించాల్సిన సమయంలో బాయ్ కాట్ చేయడం విడ్డూరమన్నారు.
చంద్రబాబుపై పరువు నష్టం దావా: మధు
కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబు పైన పరువు నష్టం దావా వేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే దావా తప్పదన్నారు. కాల్ మనీ వ్యవహారంలో తమ పార్టీ నాయకులు ఎవరూ లేరన్నారు. అధికార, ప్రతిపక్షాలు ఒకరి పైన మరొకరు విమర్శలు మాని కాల్ మనీ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications