పెల్లుబుకిన అసంతృప్తి: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన అసంతృప్తి పెల్లుబుకింది. అయితే, చంద్రబాబు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి: మంత్రివర్గ విస్తరణలో బెర్తులు దక్కని శానససభ్యులు కొంత మంది వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. కొద్ది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలకు కూడా సిద్ధపడిన విషయం తెలిసిందే.
అసంతృప్తి నేతల ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి సబబు కాదని సూచించారు. టిడిపి ఆది నుంచీ క్రమశిక్షణగల పార్టీ అని, నిబద్దతతో పనిచేస్తుందని చెప్పారు.
టిడిపి చరిత్రలో ఏనాడూ ఏ కార్యకర్తా క్రమశిక్షణ ఉల్లంఘించిన సందర్భాలు లేవని, అందుకే అధికారంలో ఉన్నా, లేకున్నా ఇంతకాలం ప్రజాదరణ పొందిందని చెప్పారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని చంద్రబాబు చెప్పారు.
ఏదైనా సుదీర్ఘ కసరత్తు చేశాకే...
ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్నా విస్తృత సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తు జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజ్యసభ, కౌన్సిల్ సభ్యత్వాలైనా, మంత్రిమండలికి ఎంపికైనా, పార్టీ పదవుల కేటాయింపులో కూడా ఈ ఆనవాయితీనే పాటిస్తామని చెప్పారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా అదే కోవలో జరిగిందని, అందరితో చర్చించి, అన్నివర్గాల వారిని సంప్రదించాకే ఎంపిక చేశామని వివరించారు.
ఇవన్నీ పరిగణనలోకి....
సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యం సహా అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నామన్నారు. వివిధ ప్రాంతాలు, కులాలు, అనుభవం, అన్ని వయసుల ప్రాతినిధ్యం, రాజకీయ సమీకరణాల ప్రాతిపదికగా మంత్రివర్గ విస్తరణ చేపట్టామని చెప్పారు. దీనిపై అసంతృప్తి సరికాదని, స్పోర్టివ్గా తీసుకోవాలని సూచించారు.
ఎక్కువగా ఆశావహులు ఉన్నప్పుడు....
పదవులు స్వల్పంగా, ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పుడు అసంతృప్తి సహజమేనని, పదవి రానప్పుడు ఎవరికైనా నిరాశ కలుగుతుందని, దాన్ని అధిగమించాలని చెప్పారు. పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలే తప్ప పత్రికలకెక్కడం సరికాదని హితవు చెప్పారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...
అందరూ ఏకతాటిపై నిలిచి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. మూడేళ్ల పసికందు లాంటి రాష్ట్రాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా అగ్రగామిగా చేసేందుకు చేసే యత్నంలో క్రమశిక్షణారాహిత్యానికి చోటివ్వరాదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి, రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేపని చేయవద్దని సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.