హైదరాబాదులో మా భద్రతకు ప్రమాదం: మోడీకి చంద్రబాబు లేఖ
హైదరాబాద్: హైదరాబాద్లో తనృమ భద్రత ప్రమాదంలో పడిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలని ఆయన ఆ లేఖలో ప్రధానిని కోరారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కెసిఆర్) తన సొంత చానెల్లో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఏపీ నేతలు, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని లేఖలో అన్నారు.
చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు, నిఘా విభాగం చీఫ్ అనురాధలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటుకు నోటు కేసు పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో తాను ఫోన్లో మాట్లాడిన ఆడియో టేప్ విడుదల కావడంపై చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, కేంద్ర మంత్రులను కలిశారు.