లెక్కలుతీస్తున్న చంద్రబాబు, జగన్ ధీమా: పవన్ కళ్యాణ్కు అదే మైనస్!
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నవ్యాంధ్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల నగారా మోగనప్పటికీ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు అప్పుడే ప్రచార బరిలోకి దిగాయని చెప్పవచ్చు. టీడీపీ ఆత్మగౌరవ సభలు నిర్వహించినా, వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినా, జనసేనాని యాత్రలు నిర్వహిస్తున్నా ఇది ముందస్తు ప్రచారంగానే భావించవచ్చు.
బీజేపీ, పవన్ ప్రభావంపై లెక్కలు తీస్తున్న చంద్రబాబు
2014 ఎన్నికల్లో చంద్రబాబు - బీజేపీ కలిసి పోటీ చేయగా, జనసేనాని అండగా నిలబడ్డారు. ఇప్పుడు బీజేపీ, పవన్ దూరమయ్యారు. దీంతో ఈ ప్రభావంతో ఏ మేరకు దెబ్బపడుతుంది, ఏ మేరకు లాభిస్తుందనే అంశాలపై చంద్రబాబు తనదైన సర్వే ద్వారా ఆరా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ కారణంగా యువత ఓట్లు నష్టపోతామని, బీజేపీ కారణంగా మైనార్టీ ఓట్లు దగ్గరవుతాయని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే బీజేపీని మైనార్టీలు కూడా ఆదరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, పవన్ ప్రభావం వల్ల నష్టపోకుండా నిరుద్యోగ భృతిని కూడా ప్రకటించారు.
Recommended Video
జగన్లో అదే కనిపిస్తోందా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి వైసీపీ గెలుపు ఖాయమని ఆయనతో పాటు కేడర్ కూడా భావిస్తోంది. అయితే ఇటీవల జగన్.. జనసేనానిపై చేసిన వ్యక్తిగత విమర్శలు, కాపు రిజర్వేషన్ అంశాలు కొంత దెబ్బతీశాయని భావిస్తున్నారు. అయినప్పటికీ టీడీపీకి బీజేపీ, జనసేన దూరం కావడం, జనసేన కొత్త పార్టీ కావడం వల్ల.. జగన్ ఆశలు పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్లో కనిపించిన అతివిశ్వాసమే ఇప్పుడు కనిపిస్తోందనే వాదనలు లేకపోలేదు.
అలా అయితే పవన్కు చేదు అనుభవం తప్పదని
జనసేనకు పవన్ కళ్యాణ్ పెద్ద అసెట్. అయితే అదే మైనస్ అనే వారు లేకపోలేదు. ఎందుకంటే జనసేన అంటే ఇప్పటికీ పవనే గుర్తుకు వస్తారు. ఇంకా చెప్పాలంటే ఏ నియోజకవర్గంలోని సరైన నాయకుడు లేదా పోటీ చేయదగిన నేతలు లేరనే చెప్పవచ్చు. పవన్కు ఉన్న క్రేజ్ ఎవరికీ లేదనడంలో సందేహం లేదు. కానీ క్రేజ్ వేరు, ఓటు వేరు. ఎన్నికలు మరో ఏడాది కూడా లేవు. ఇలాంటి సమయంలో కూడా ఆ పార్టీలో కనీసం ఎక్కడా పోటీ చేయదగిన నేత లేకపోవడం మైనస్ అంటున్నారు. పవన్ ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నట్లుగా కనిపిస్తున్నారని అంటున్నారు. మేల్కోకుంటే మాత్రం చేదు అనుభవం తప్పదంటున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి అంతే
ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఇప్పటికీ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే కనీసం డబుల్ డిజిట్ వస్తుందా అనేది అనుమానమేనని, అలాగే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2014లాగే ఉందని అంటున్నారు. లెఫ్ట్ పార్టీ మాత్రం జనసేనతో కలిసి బీజేపీ, కాంగ్రెస్ల కంటే మంచి సీట్లు దక్కించుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.