రూ. 70 లక్షల టోకరా: మాజీ అడిషనల్ డిజిపై కేసు నమోదు
హైదరాబాద్: ఎంబిబిఎస్ సీట్లు ఇప్పిస్తామని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మాజీ అడిషనల్ డీజీ మదన్లాల్పై కేసు నమోదైంది. ఎంబిబిఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసం చేశారని, రూ. 70 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓఎన్జీసీలో పని చేస్తున్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఎంబిబిఎస్ సీటు కోసం రిటైర్డ్ అడిషనల్ డీజీ మదన్లాల్ను ఆశ్రయించాడు. కాగా, రూ. 70లక్షలు ఇస్తే మెడిసిన్ సీటు ఇప్పిస్తానని మదన్ లాల్ నమ్మించారు.
దీంతో ఉదయ్ కుమార్ అతడు అడిగిన మొత్తం రూ. 70 లక్షలను ముట్టజెప్పాడు. అయితే సీటు ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వమని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో బాధితుడు ఉదయ్ హైటెక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉదయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపిసి 403, 406, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.