దన్నం పెట్టి చెబుతున్నా, అడ్డంకులు సృష్టించొద్దు: చంద్రబాబు
అమరావతి: తాత్కాలిక సచివాలయంపై కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో నిర్మించదలచిన తాత్కాలిక సచివాలయానికి నిర్మాణానికి ఆయన బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి పవిత్ర ప్రాంతమని కొనియాడారు. నవ్యాంధ్ర నూతన రాజధాని కోసం భూమ ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఊరికి, ఊరి పక్కనే ఉన్న కృష్ణమ్మకు నమస్కరించి చెబుతున్నా, రైతలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.
కొన్ని బాధ్యతలు మనం కోరుకోమన్నారు. గతంలో ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట నుంచి బ్రిటిష్ పాలలో ఉందన్నారు. ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలోకి రావడం, చెన్నై కేంద్రంగా తెలుగు వారంతా భాగస్వామిగా కలిసి ఉన్నారన్నారు. తెలుగు వారి కోసం పొట్టి శ్రీరాములు ఉద్యమం చేయడంతో ఏపీ ఏర్పడిందన్నారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడం ఒక చరిత్రగా నిలిచందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మనం అందరం అమరావతికి వచ్చి నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టామన్నారు. వెలగపూడిలో నిర్మించదలచిన తాత్కాలిక సచివాలయం భవనాలు శాశ్వతంగా ఉంటాయని చెప్పారు.
ఈ భూమికి ఒక చరిత్ర ఉందని, శాతవాహన రాజధానికి ఈ భూమి ఘన చరిత్ర సృష్టించిందన్నారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలని ఓ సంఘటన అన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మన దేశంలో కాకుండా ప్రపంచంలోని అన్ని పవిత్రమైన దేవాలయాల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలను తీసుకొచ్చి పూజలు చేశామన్నారు.
ఈరోజు చరిత్రను మనం నెమరవేసుకోవాల్సిన సమయమన్నారు. ప్రజా రాజధానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆనాడు మంత్రి వర్గ సమావేశంలో గుంటూరు-కృష్ణా మధ్యనే రాజధాని నిర్మించాలని తీర్మానించామన్నారు. నా మీద నమ్మకముంచి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కోసం రైతులు స్పందించిన తీరు అద్భుతమన్నారు.
అతి తక్కువ సమయంలో రైతుల వద్ద నుంచి 33వేల ఎకరాలను సమీకరించామన్నారు. ఇదొక చరిత్ర అన్నారు. ఇక రాజధానికి ఏ పేరు పెట్టాలని చాలా పేర్లు ఆలోచించామన్నారు. చివరకు రాజధాని పేరుని అమరావతిగా నిర్ణయిస్తూ మంత్రి మండలిలో తీర్మానం చేశామన్నారు.
ఇక కొంత మంది ఇది తాత్కాలిక రాజధాని అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ భూమి నుంచి పరిపాలన జరగాలని ఆలోచించే ఇక్కడికి వచ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఇబ్బందులున్నాయన్నారు. 65 సంవత్సరాలుగా హైదరాబాద్లో పని చేస్తున్న ఉద్యోగులను ఉన్నపళంగా అన్ని వదులుకుని రావాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుందన్నారు.
ఉద్యోగులు కూడా రాష్ట్ర విభజన సమయంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం వచ్చిన తర్వాత ఉద్యోగులంతా నిర్వీర్యమైపోయారన్నారు. ఆ తర్వాత నూతన రాజధానిని కట్టాలని నేను సంకల్పించి ప్రజలకు పిలుపు ఇచ్చానన్నారు.
మీకు అభివృద్ధి చేసిన తర్వాత ఈ భూమి విలువ పెరుగుతుందని రైతులంతా నమ్మారని పేర్కొన్నారు. మంగళవారం మేకిన్ ఇండియాకు వెళితే ముంబైలో దీని గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అంతలా ప్రజలు తనని నమ్మారని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి విశ్వసనీయత పెంచుకోవాలంటే ఎంతో నమ్మకం ఏర్పడాలన్నారు.
వన్ ప్లస్ 8గా తాత్కాలిక సచివాలయం భవంతులను నిర్మిస్తున్నామన్నారు. అమరావతిని ప్రపంచంలోనే టాప్ టెన్లో ఉంచుతామన్నారు. రాష్ట్ర ఉద్యోగులు కూడా రాష్ట్ర పరిస్థితిని అర్ధం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. మన దగ్గర డబ్బులు పోయినా రాజధాని మాస్టర్ ప్లాన్ నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం సహకరించిందన్నారు.
ఏపీని అభివృద్ధిలో ఎలా తీసుకెళ్లాలా అని తాను ఆలోచిస్తుంటే, దానిని కొంతమంది భరించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలు విమర్శలు మానుకుని వీలైతే సహకరించాలని కోరారు. సహకరించే మనసు లేకపోతే దన్నంపెట్టి చెబుతున్నా అనవసర విమర్శలు చేయకండని సూచించారు.
అమరావతిలో రాజధాని కడతానంటే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ప్రపంచం మొత్తం రాజధాని వైపు చూస్తుంటే ప్రతిపక్షాల మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. ఈ శుభ సందర్భంలో వారు కూడా ఓ ఆలోచన చేయాలని సూచించారు. అరాచకం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉండదన్నారు.
సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్రమంత్రులు చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత, పీతల సుజాత, ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.