వీడిన చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం మిస్టరీ.. జరిగింది ఇదే!
Palnadu Accident: పల్నాడు జిల్లాలోని చిలకలూరి పేట వద్ద 3 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసులు జరిపిన విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదానికి అసలు కారణం ఇదే..
జాతీయ రహదారిపై ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న ఒక భారీ కంటైనర్ను ఆపడానికి జరిగిన ప్రయత్నమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తమ విచారణలో తేల్చారు. కొంతమంది వ్యక్తులు కంటైనర్ను బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తూ, తమ కారును కంటైనర్కు అడ్డుగా నిలిపారని పోలీసులు వెల్లడించారు. అడ్డుగా నిలిచిన కారు వల్ల కంటైనర్ ఆగిపోగా, వెనుక నుంచి వేగంగా వస్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. కంటైనర్ను అడ్డగించి ఆపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ ఆఫీస్లో పనిచేసే ఒక ఏఎస్ఐ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) కుమారుడిగా పోలీసులు గుర్తించారు.

'బ్రేక్ ఇన్స్పెక్టర్' అవతారమెత్తిన ఏఎస్సై కుమారుడు
పోలీసుల దర్యాప్తులో ఏఎస్ఐ కుమారుడి ఆగడాలు కూడా బయటపడ్డాయి. నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు కూడా, ఎప్పటిలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ మాదిరిగా వ్యవహరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కంటైనర్ను ఆపడానికి ప్రయత్నించాడు. నిందితుడి అక్రమ చర్య కారణంగానే ఐదుగురు విద్యార్థులు మృతి చెందారని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.2023లో నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షలతో ఉడాయించినట్లు కూడా తెలిసింది.సెపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని మరీ జిల్లాలో పలు దందాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అతడిపై ఇప్పటికే 8 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి
ఈ విషాదకర ఘటన ఈ నెల 4న చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగింది. మరణించిన ఐదుగురు విద్యార్థులు గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీరంతా అయ్యప్ప మాల ధరించారు. శబరిమల యాత్రకు వెళ్లడానికి ముందు తమ స్వగ్రామాలకు (ఒంగోలుకు) కారులో బయలుదేరారు. వేగంగా దూసుకొచ్చిన వీరి కారు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో, కారు పూర్తిగా కంటైనర్ కిందకి దూసుకుపోయింది. ఈ కారణంగానే ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.












Click it and Unblock the Notifications