'అమరావతి' నిర్మాణానికి ఛాన్సివ్వండి: చైనా, షరతులు పెట్టిన బాబు!
అమరావతి: చైనాకు చెందిన జిఐఐసి కంపెనీల ప్రతినిధుల బృందం గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం క్యాంపు కార్యాలయంలో భేటీ అయింది. జిఐఐసి వైస్ ప్రెసిడెంట్ ట్యాంగ్ చాంగ్ వెల్ ఈ బృందానికి నేతృత్వం వహించారు.
జియాంగ్ కాపిటల్ సిటీ నిర్మించిన అనుభవం ఉందంటూ ఆ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ బృంద సభ్యులు తెలిపారు. అర్బన్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్, రోడ్డు కనెక్టివిటి, రైల్ అండ్ సబ్వేస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, బిజినెస్ ఎగ్జిబిషన్ సెంటర్ తదితర నిర్మాణాలన్నింటిని జియాంగ్ రాజధానిలో ఏడాదిన్నర వ్యవధిలోనే నిర్మించామన్నారు.
సీఎం చంద్రబాబు తన చైనా పర్యటనలో తమ బృందం సభ్యులు కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ప్రధాని మోడీ పర్యటనలో జిఎంఆర్ కెఎస్ఇజడ్ బృందంతో కాకినాడలో హైటెక్ చైనీస్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలనే అవగాహన కుదిరింది. ఆ మేరకు చైనా బృందం ప్రస్తుత రాష్ట్ర పర్యటనకు వచ్చింది.
ఈ సందర్భంగా వారు అమరావతిలో, రాజధాని ప్రాంత గ్రామాలను వారు సందర్శించారు. నిర్మాణ పనుల్లో తమను కూడా భాగస్వాములను చేయాలని వారు గురువారం సీఎం చంద్రబాబును కోరారు. చైనా కంపెనీలు అన్నీ ఒక ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని సిఎం చంద్రబాబు సూచించారు.
సిఎం కార్యాలయం, సచివాలయం, హోటళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని సిఎం చంద్రబాబు కోరారు. కాకినాడ పోర్టు అభివృద్ధితోపాటు అమరావతి నిర్మాణంలో కూడా అవకాశమిస్తామన్నారు. రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణాలు కూడా రాష్ట్రంలో చేపడుతున్నారు. జియాంగ్ కాపిటల్ను ఏడాదిన్నర కాలంలో నిర్మించారని అంతే వేగం, నైపుణ్యంతో అమరావతిని కూడా నిర్మించాలని చంద్రబాబు సూచించారు.

దుర్గ గుడివద్ద ఫ్లైఓవర్ పనులు ప్రారంభం
విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పనులు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో జాతీయ రహదారి సంస్థ పిలిచిన టెండర్లను తెరవగా రూ.264 కోట్లతో సోమా కంపెనీ టెండర్ను దక్కించుకుంది.
టిడిపి ప్రతిపక్షంలో ఉండగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం స్థానిక నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నేతృత్వంలో దీర్ఘకాలం ఆందోళన జరిగింది. ఫ్లైఓవర్కు యుపిఏ ప్రభుత్వం నిధులు మంజూరుచేసినప్పటికీ ల్యాంకో టవర్ల కోసం నాటి ఎంపీ రాజగోపాల్ రద్దు చేయించారని చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో దుర్గగుడి వద్ద బైఠాయించారు.
అదే సమయంలో దీనికి పోటీగా రాజగోపాల్ ధర్నా చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానంటూ అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కొంత జాప్యం జరిగినప్పటికీ ఎంపి కేశినేని నాని ఢిల్లీలో చేసిన కసరత్తుతో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ పచ్చజెండా ఊపారు.
వెనువెంటనే నిధులు కూడా మంజూరు కావడంతో గురువారం రాత్రి నుంచి పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఇళ్లు, స్థలాలు కోల్పోయిన లబ్దిదారులకు రూ.40కోట్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివసిస్తున్న పందొమ్మిది మంది లబ్దిదారులకు రూ.40 లక్షల మేర పరిహారాన్ని అందించారు.
ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన విద్యుత్ శాఖకు సంబంధించిన ఐదు టవర్లను ఐదు బృందాల సభ్యుల ఏక సమయంలో తొలగించటం ప్రారంభించారు. ఇక కొన్ని మాసాలపాటు ట్రాఫిక్ను మళ్లించేందుకు గాను పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications