దిగ్విజయ్ సంకేతాలు: నాలుగో కృష్ణుడు చిరంజీవే?
న్యూఢిల్లీ: రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి చిరంజీవి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వంలో నాలుగో కృష్ణుడు ఆయన కానున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చిరంజీవిని చేసి, భవిష్యత్తు కార్యాచరణను నడిపించి యోచనలో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర బాధ్యతలు చిరంజీవికి అప్పగించి ఆయన ప్రజాకర్షణను ఆయుధంగా చేసుకుని ఎన్నికలను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ మేరకు చిరంజీవితోపాటు రాష్ట్ర నేతలకు కూడా ఆ పార్టీ అధిష్ఠానం స్పష్టమైన సంకేతాలు పంపింది. సాధ్యమైనంత త్వరలోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ముఖ్యమైన బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా మంగళవారం తనను కలిసిన కేంద్ర మంత్రి చిరంజీవికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రిగా కాపు వర్గానికి చెందిన చిరంజీవిని ఎంపిక చేస్తున్న నేపథ్యంలో అదే వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను దళిత వర్గాలకు చెందిన నేతకు అప్పగించే విషయంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర పిసిసి సారథ్య బాధ్యతలను మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్కు అప్పజెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా? కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే అంశంపై మంగళవారం సాయంత్రం వార్ రూమ్లో సీమాంధ్ర నేతలతో అధిష్ఠానం పెద్దలు సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, పార్టీ కార్యదర్శులు కుంతియా, తిరునావక్కరసు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.