చిరంజీవే చెప్పారు: బాలకృష్ణపై రఘువీరా ఆగ్రహం, జగన్కు అండ
అనంతపురం: తమ పార్టీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ నటుడు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీఫ్ రఘువీరా రెడ్డి బుధవారం నాడు మండిపడ్డారు. చివరి వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చిరంజీవి చెప్పారని గుర్తు చేశారు.
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడంపై రఘువీరా రెడ్డి స్పందించారు. పార్టీ మారేవారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశాకే ఇతర పార్టీలలోకి వెళ్లాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన నేతల పైన ఈసీ అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ ఫిరాయింపుల పైన జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నప్పటికీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఆ పార్టీ బలహీనతకు నిదర్శనం అన్నారు. చరిత్రకారుల వైభవం చాటేందుకు ఉత్సవాలు చేయాలి.. కానీ సొంత ప్రచారం కోసం ఉపయోగించుకోవడం సరికాదని లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాగా, చిరంజీవి బిజెపిలోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. చిరంజీవి కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు వచ్చాయి.
ఇప్పటికే ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో... ఏపీలో సొంతంగా ఎదగాలనే ఆలోచనలో ఉన్న బిజెపి కాపులకి ముఖ్యమంత్రి పదవి అనే ఎజెండాతో చిరంజీవిని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
చిరంజీవితో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మంతనాలు జరుపుతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల పైన చిరంజీవి కూడా స్పందించారు. తనకు పార్టీ మారాలన్న ఆలోచనే లేదన్నారు. బిజెపిలో చేరతానన్నది అవాస్తవ ప్రచారమన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానన్నారు.