ఇక కాంగ్రెస్ వంతు!: టీడీపీలోకి మాజీ సీఎం కిరణ్ ముఖ్య అనుచరుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పటి వరకు విపక్ష పార్టీ అయిన వైసీపీని లక్ష్యంగా చేసుకుని జరిగిందే. అయితే తాజాగా ఈ ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీలోని నేతల వైపుకి మళ్లింది. విభజన నేపథ్యంలో గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అంతేకాదు చరిత్రలో కనివినీ ఎరుగని ఓటమిని చవిచూసింది. అయితే మళ్లీ ఏపీలో తిరిగి తన ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ బిల్లును ఎలాగైనా పాస్ చేయించుకుంటే రాష్ట్ర ప్రజలను మళ్లీ తనవైపుకి తిప్పుకోవచ్చనే ఆలోచనలో ఉండగా ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం చల్లగా ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది.
జిల్లాలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేత, ప్రస్తుతం జిల్లాలోని మదనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న దేశాయి తిప్పారెడ్డి చేతిలో సింగిల్ ఓటు తేడాతో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ నేత నరేశ్ కుమార్ రెడ్డి ఈ నెల 25న టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. తన సింగిల్ ఓటు ఓటమిని జీర్ణించుకోలేని నరేశ్ కుమార్ రెడ్డి హైకోర్టుని కూడా ఆశ్రయించారు. న్యాయపోరాటంలో భాగంగా ఆయన ఇటీవలే విజయం సాధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు.
గతంలో నరేశ్ కుమార్ రెడ్డి మదనపల్లె మునిసిపాలిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈ క్రమంలో చిత్తూరులో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు స్థానిక టీడీపీ నేతలు చేసిన యత్నాలు ఫలించాయి. ఈ క్రమంలో ఈ నెల 25న చంద్రబాబు సమక్షంలో నరేశ్ కుమార్ రెడ్డి సైకిల్ ఎక్కనున్నారు.












Click it and Unblock the Notifications