'ముఖ్యమంత్రి': లోకేష్కు ఉన్నత పదవి.. వెనుక!, కొత్త ట్విస్ట్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఉత్సాహం చూపిస్తోంది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. వీటిపై టిడిపి నేతలు, మంత్రులు స్పందిస్తున్నారు.
నారా లోకేష్కు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. లోకేష్ కోసం పదవులకు రాజీనామా చేసేందుకు కూడా కొందరు నేతలు సిద్ధంగా ఉన్నారు. లోకేష్ కోసం తాము తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తామని చెబుతున్నారు.
తాజాగా, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కొల్లు రవీంద్రలు లోకేష్కు మంత్రి పదవి పైన స్పందించారు. గంటా మాట్లాడుతూ... లోకేష్ మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడని చెప్పారు. ఆయనను కేబినెట్లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. లోకేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిష్టించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు చంద్రబాబు అండగా నిలిచారని, అలాగే ఇప్పుడు చంద్రబాబుకు లోకేష్ అండగా నిలవాలన్నారు. కేబినెట్లో యువతకు ప్రాధాన్యం ఉంటే బాగుంటుందని చెప్పారు. మరోవైపి, లోకేష్కు మంత్రి పదవి ఇవ్వాలని కృష్ణా జిల్లా బీసీ సెల్ తీర్మానం చేసింది.
ఇదిలా ఉండగా, లోకేష్ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చే విషయంలోను, ఆయనకు పార్టీలో పదవి కట్టబెట్టే విషయంలోను, ఇప్పుడు మంత్రిగా చేసే విషయంలోను తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
గంటా వ్యాఖ్యల పైన చర్చ కూడా సాగుతోంది. లోకేష్ను కేబినెట్లోకి ఆహ్వానిస్తున్నామని, ఆయన భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని గంటా చెప్పారు. ఆ వ్యాఖ్యల వెనుక 'ముఖ్యమంత్రి' అని అర్థం కావొచ్చని అంటున్నారు. 2024కు లోకేష్ను తయారు చేస్తున్నారని భావిస్తున్నారు.
ఓ వైపు లోకేష్కు మంత్రి పదవి పైన జోరుగా ఊహాగానాలు వస్తుండగా.. మరోవైపు ఉప ఎన్నికల బరిలో లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచాకనే మంత్రి పదవి దక్కనుందనే కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే... లోకేష్ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక.. మంత్రి పదవి ఇస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications