ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ముసలం
సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చెలరేగిన ముసం అధిష్టానాన్ని తీవ్రంగా చికాకు పరుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈ నియామకాలే పార్టీలో విభేదాలకు కారణమయ్యాయి. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 'రాష్ట్రానికి-ఇదేం ఖర్మ''కార్యక్రమంతో 50 రోజులపాటు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఒకవైపు అధినేత పార్టీ కార్యక్రమంలో ఉంటే మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షుల నియామకం అలజడి రేపింది. పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వలేదని నిరసిస్తూ అందరూ రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో అసమ్మతి నేతలంతా సమావేశమై చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. చంద్రబాబును కలిసి వాస్తవాలను వివరించడానికి సిద్ధమయ్యారు. తాజాగా అప్పగించిన పార్టీ పదవులను రద్దుచేయాలని కోరనున్నారు. రద్దుచేయకపోతే మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గం మొదటి నుంచి పార్టీ అధినేతను చికాకు పరుస్తూనే ఉంది. నిన్నటి వరకు ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఒక అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోగా మిగిలిన ఇద్దరూ.. కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకాగా, మరొకరు చలపతి ఆంజనేయులు వర్గం. వీరిమధ్య విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయని, అయినప్పటికీ అధినేత చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని, దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.