ఉచిత బస్సు అమలు ముహూర్తం ప్రకటించిన చంద్రబాబు - వారికే వర్తింపు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే సమయంలో తల్లికి వందనం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా రైతులకు అన్నదాత సుఖీభవ పైన స్పష్టత ఇచ్చారు. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ముహూర్తాన్ని చంద్రబాబు ప్రకటించారు.
ఆగస్టు 15 నుంచి
ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ప్రారంభిస్తామని చంద్రబాబు కర్నూలులో ప్రకటించారు. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం కసరత్తు
ఉచిత బస్సు పధకం అమలు పైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. తాజాగా శాసన మండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం.. తీసుకోవాల్సిన చర్యల పైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది. పథకం అమలు పై ఆ తరువాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు పైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే మంత్రులు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు.
కర్ణాటక తరహాలో
అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2,000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు లేక, పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3,500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జిల్లాల్లో పర్యటనలకే ఈ పథకం పరిమితం చేస్తారా లేక, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications