మెడికల్ కాలేజీల వివాదం వేళ చంద్రబాబు కీలక ప్రకటన..!!
ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పైన నిర్ణయం తీసుకుంది. దీనిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరిస్తున్నారని ఆందోళన చేస్తోంది. కోటి సంతకాలు సేకరించింది. మాజీ సీఎం జగన్ రేపు (గురువారం) ఇదే అంశం పై గవర్నర్ ను కలవనున్నారు. కాగా.. ఈ వివాదం పైన సీఎం చంద్రబాబు స్పందించారు. మంత్రులు.. అధికారుల సమక్షంలో కీలక ప్రకటన చేసారు.
పీపీపీ పద్దతిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా సీఎం మెడికల్ కాలేజీల పైన స్పందించారు. పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయ ని చంద్రబాబు వివరించారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతు న్నారని చెప్పుకొచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని స్పష్టత ఇచ్చారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని స్పష్టం చేసారు.

ఇక.. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరిగాయని వివరించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని చెప్పుకొచ్చారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్లమన్నారు. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్ గా మారిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని చెప్పారు.
విమర్శలు చేస్తే భయపడేది లేదని.. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయ ని.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని చెప్పుకొచ్చారు. అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని విమర్శించారు. ఇప్పుడు అప్పులు రీ-షెడ్యూలు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో అప్పులను రీ-షెడ్యూలింగ్ చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.












Click it and Unblock the Notifications