మోదీ బిగ్ ఆఫర్, చంద్రబాబు ఛాయిస్ - ఆ పదవి దక్కేదెవరికి..!!
ఏపీ కేంద్రంగా ఢిల్లీలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఖరారు పైన బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. రేపు (ఆదివారం) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఇందులో ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేయనున్నారు. ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ దిశగా మోదీ టీం లెక్కలు మొదలు పెట్టింది. ఈ సమయంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఈ భేటీలో ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీ పర్యటన వేళ
నూతన ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరనేది బీజేపీ అధినాయకత్వం రేపు (ఆదివారం) ఫైనల్ చేయనుంది. ఎలక్టోరల్ కాలేజ్ లో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. ఇండియా కూటమి అభ్యర్ధిని పోటీ లో దించితే సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్ధి ఈ నెల 21న నామినేషన్ వేసే అవకాశం ఉంది. నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా సీఎం చంద్రబాబు హాజరు అవుతారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే కొత్త ఉప రాష్ట్రపతి పైన బీజేపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చింది. అభ్యర్ధి ఖరారు బాధ్యత ప్రధానికి అప్పగించింది. రేపు పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఆరెస్సెస్ అభిప్రాయంతో పాటుగా అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్ధిని ప్రకటించనున్నారు.

చంద్రబాబు లెక్కలు
దక్షిణాది నుంచి లేదా మహారాష్ట్రకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఇక.. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ క్యాంపు చెబుతోంది. ఇప్పటికే కేంద్రం కేబినెట్ లో ఏపికి మరో బెర్తు ఖాయమని సమాచారం. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరు కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. మరో మంత్రిగా అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ నుంచి పురందేశ్వరికి మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. ఇక.. జనసేన సైతం అవకాశం వస్తే కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. అయితే, టీడీపీకే మరో మంత్రి పదవి కేటాయించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కాగా, చంద్రబాబు దే ఈ విషయంలో తుది నిర్ణయం.
ఛాన్స్ దక్కేదెవరికి
బీజేపీకి అవకాశం ఇస్తే ఆ పార్టీకి ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. టీడీపీ నుంచి పలువురు ఆశావాహులు ఉన్నారు. ఈ సారి మంత్రి పదవి ఎస్సీ లేదా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా రెడ్డి వర్గానికి ప్రధానం గా నెల్లూరు ఎంపీ పేరు ప్రచారంలో ఉంది. ఎస్సీ వర్గానికి ఇస్తే చిత్తూరు ఎంపీకి అవకాశం పైన అంచనాలు కనిపిస్తున్నాయి. అయితే, బీజేపీ నుంచి మరొకరికి అవకాశం ఇస్తారని.. కీలక పదవి నిర్వహించిన మాజీ నేత వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఈ సారి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటుగా కేంద్రంలో నామినేటెడ్ పదవులలో మిత్రపక్షాల కు ప్రాధాన్యత పైన నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications