టీడీపీకి మరో కీలక పదవి: ప్రధాని మోదీ- చంద్రబాబు భేటీలో కీలక నిర్ణయాలు..!!
కేంద్రంలో టీడీపీకి కీలక పదవి. ప్రధాని మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్న వేళ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మోదీ సమావేశం అవుతున్నారు. మిషన్ 2029 లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ నుంచి మరో కేంద్ర మంత్రి పదవి.. టీడీపీకి కేంద్రంలో మరో పదవి దక్కేలా కొత్త నిర్ణయాలకు రంగం సిద్దమైంది.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. గురువారం రాష్ట్రపతి భవన్లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సీఎం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9.00 గంటలకు అమరావతి చేరుకుంటారు.

ఎన్డీఏ, నీతిఅయోగ్ సమావేశాలకు హాజరు
కాగా.. కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటుగా భాగస్వామ్య పక్షాలకు పదవుల ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ - జనసేనలో ఎవరికి ఈ పదవి దక్కుతుందనేది కూటమి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీకే మరో సహాయ మంత్రి దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక.. టీడీపీకి లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవి పైనా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాల పైన ఢిల్లీ పర్యటనలో చర్చించి.. ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. ఈ నెలాఖరులోగా కేంద్రంలో ఏపీకి దక్కే ప్రాధాన్యత.. పదవుల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications