తిరుపతి లడ్డు వివాదం..ఇరకాటంలో పడ్డ చంద్రబాబు సర్కార్..?
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు.
లడ్డుల్లో నెయ్యిపై జులై 8, 2024న ల్యాబ్కు పంపించగా.. జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చేలరేగింది. వైసీపీపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అయితే ఈ ఇష్యూపై వైసీపీ నాయకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. చంద్రబాబు హామీల అమల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా దీనిపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమలపై ఏ రాజకీయ నాయకుడు చేయని వ్యాఖ్యలు చంద్రబాబు చేశారన్నారు.

తన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని. టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమల పవిత్రతను కాపాడామని చెప్పుకొచ్చారు. అలాగే తాను వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అలాగే సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే.. చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిన తేదీలపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆ తేదీలను ఓసారి పరిశీలిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ శాంపిల్స్ను సేకరించారని ఇట్టే అర్థం అవుతుందని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. జూలైలో నివేదిక ఇస్తే ఇప్పటి వరకు బయటపెట్టకుండా ఎందుకు దాచారని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అలా కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇట్టే తెలిసిపోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ పట్ల ప్రజల్లో విపరీతమైన ద్వేషాన్ని కలిగించడం అనేది టీడీపీ లక్ష్యం కావొచ్చని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి ప్రసాదం మీద సీఎం చంద్రబాబు , కూటమి నేతలు చేసిన ఆరోపణలు మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వయరీ చేయించాని హైకోర్టులో వైసీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ ఇది నిరూపణ కాకపోతే చంద్రబాబు సర్కార్ ఇరకాటంలో పడినట్టే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీ వేసిన పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం వచ్చే బుధవారం విచారణ చేస్తామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications