కేంద్రానికి భయమెందుకు?...సిఎం చంద్రబాబు సూటి ప్రశ్న!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఉండవల్లిలోని సిఎం క్యాంపు ఆఫీసు ప్రాంగణంలోని గ్రీవెన్స్ భవనంలో బుధవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర స్థాయి సాధికార మిత్రల సదస్సులో ఆయన కేంద్ర ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. పార్లమెంట్లో టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై కేంద్రం ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పడానికి ఎందుకు భయపడుతోందని సిఎం చంద్రబాబు ప్రశ్నించారు.
Recommended Video
రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగితే బెదిరిస్తారా?...విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?...సిఎం చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు. తామేమైనా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నామా?...అదే నిజమైతే ఆ విషయమే స్ఫష్టంగా చెప్పెయ్యమంటున్నామన్నారు. ఎపికి కేంద్రం న్యాయం చేసే వరకు తాము పోరాడుతూనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అవిశ్వాసానికి...అనేక పార్టీల మద్దతు...
లోక్సభలో టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి దేశంలోని అనేక పార్టీలు మద్దతిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం లోని రాజకీయపార్టీలు కూడా తమతో కలిసి రావాలని ఆయన సూచించారు. ప్రత్యేక హోదా, ప్రయోజనాల కోసం చేసే ఆందోళనలు, నిరసనలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్న విషయాన్ని అందరూ గమనించాలని సిఎం చంద్రబాబు సూచించారు. ఎపి పట్ల ఇంత మొండిగా వ్యవహరించడం వెనుక వ్యూహమేమిటని, ఏ భరోసాతో ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఇంత కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని తెలుగువారిలోనూ కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.
నోటీసు...అనుమతించాల్సిందే!
కేంద్రంపై లోక్సభలో టిడిపి ఇచ్చిన అవిశ్వాసం నోటీసును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనికి మరో ప్రత్యామ్నాయం లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అవిశ్వాస తీర్మానం ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే మరింత ఆగ్రహానికి గురవుతారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి సాయం చేసే విషయంలో భాజపాకి ఎన్ని అవకాశాలిచ్చినా వినియోగించుకోలేదని ధ్వజమెత్తారు. మంచిగా సావధానంగా అడిగినప్పుడు చేయలేదు...మంత్రులతో రాజీనామా చేయించి, ఎన్డీయే నుంచి తప్పుకున్నా చలనం లేదు...అవిశ్వాసం పెట్టినా స్పందన లేదు. ఆంధ్రప్రదేశ్ దేశంలో అంతర్భాగం కాదా?...రాష్ట్రానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా?...అంటూ సీఎం చంద్రబాబు కేంద్రంపై విరుచుకుపడ్డారు.
వైసిపిది లాలూచీ...టిడిపిది ప్రజలది...
"కేంద్రపై వైసిపి పెట్టిన అవిశ్వాసం లాలూచీ అవిశ్వాసం...టిడిపి పెట్టిన అవిశ్వాసం 5 కోట్ల ప్రజలది. ఈ రెండింటికీ ఎంతో తేడా ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు కేంద్రంతో లాలూచీపడి రాష్ట్రానికి నష్టాన్ని కలిగించేలా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం అలాంటి పార్టీలతో కలిసి రాజకీయాలు చేయాలని చూస్తోంది. ఎవరెన్ని చేసినా పోరాటం ఆగదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే... నాలుగేళ్లలో మీరు చేసిందేమిటి? అవమానం, అన్యాయమే చేశారు...రాష్ట్రాన్ని చిన్న పిల్లాడిలా నాలుగేళ్లూ కాపాడుకుంటూ వస్తే సాయం చేయకపోగా...రాజకీయాలు చేస్తారా?"...అంటూ కేంద్రాన్ని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఎపి హక్కుల కోసం...పోరాటమిది...
బుధవారం ఉదయం సిఎం చంద్రబాబు టిడిపి ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ సమస్య ఇప్పుడు జాతీయ స్థాయి అంశంగా మారిందని చంద్రబాబు చెప్పారు. బిజెపి మినహా అన్ని పార్టీలు ఎపి పోరాటం పట్ల సానుభూతితో మద్దతు ఇస్తున్నాయన్నారు. 1985 ఆగస్టు సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు చివరిదాకా ఒక్కతాటిపై నిలిచి ఘనవిజయం సాధించారని...ఇప్పుడు కూడా ఎంపీలందరిలో అదే స్ఫూర్తి కనిపించాలని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాడాలన్నారు. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఏం చేస్తానని చెప్పింది?...అవి ఎంతవరకు చేసింది?...ఇంకా ఏం చేయాలి?... పార్లమెంటులో ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారన్నఅంశాలపై ఎంపీలకు అవగాహన ఉండాలని...దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరేదాకా కేంద్రం తోడ్పాటు అందించాలని సీఎం స్పష్టం చేశారు.