మత్స్యకార కుటుంబాలకు భారీ సహాయాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటింది. ఆ తర్వాత ఇది బలహీనపడింది. అయినప్పటికీ- నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు.
తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ.. అర్ధరాత్రి వరకు సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. తుఫాను ప్రభావం ఉన్న అన్ని గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ చేపట్టారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు. మూడుసార్లు ఆర్టీజీఎస్ కు వచ్చారు. సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు.

సమీక్ష ముగించుకుని రాత్రి 11.30 గంటల తర్వాత ఆర్టీజీఎస్ నుంచి చంద్రబాబు ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో 12 గంటల పాటు ఏకధాటిగా టెలి కాన్ఫరెన్సులు, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులతో తుపాను ప్రభావాన్ని పర్యవేక్షించారు. అర్ధరాత్రి తర్వాత కూడా సచివాలయంలోనే ఉండి మొంథా తుపానుతో నెలకొన్న పరిస్థితులను నారా లోకేష్ సమీక్షించారు. రాత్రంతా ఆయన సచివాలయంలోనే ఉన్నారు.
మొంథా తుఫాన్ ఉండటం వల్ల అర్ధరాత్రి వరకూ తాము విధుల్లో ఉన్నామని చంద్రబాబు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి చంద్రబాబు వివరించారు. తుఫాన్ తర్వాతి పరిస్థితులను శరవేగంగా చక్కదిద్దాలని ఆదేశించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం కనిపిస్తోందని చంద్రబాబు చెప్పారు. భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయని, వాటిని ఎప్పటికప్పుడు తొలిగించాలని చంద్రబాబు ఆదేశించారు.
గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందేనని, బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందని అన్నారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట, వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు సాయం అందిస్తుందని తెలిపారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.












Click it and Unblock the Notifications