ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాలకు షాక్
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. గ్రామ/వార్డు సచివాలయాల కొనసాగింపుపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకుని వచ్చే దిశగా కసరత్తు చేపట్టింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనితో పాటు వలంటీర్లనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇళ్ల వద్దకే లబ్దిదారులకు అందించేది.

ఈ ఏడాది ప్రభుత్వం మారిన తరువాత ఈ రెండు వ్యవస్థల మనుగడ ప్రశ్నార్థకమైంది. వలంటీర్ల కొనసాగింపుపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలో కూడా సమూల మార్పులను తీసుకుని రావాలని నిర్ణయించింది.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్షను నిర్వహించారు. దీన్ని మరింత పటిష్ఠ పర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లేలా రూపుదిద్దేలా ప్రణాళికలను రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
సచివాలయాల పునర్వవస్థీకరణ, వీటి ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, పనితీరుపై ఈ సందర్భంగా అధికారులు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీలకు అనుగుణంగా సచివాలయాలు ఉండట్లదేని తెలిపారు. 13,291 ఉండగా గ్రామ సచివాలయాల సంఖ్య మాత్రం 11,162గా ఉంటోందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా వీటిల్లో ప్రస్తుతం 1,19,803 మంది ఉద్యోగులు నేరుగా రిక్రూట్ అయ్యారని అధికారులు వివరించారు. ఇతర విభాగాలవారిని కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 1,27,175కి చేరుతుందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
సచివాలయ ఉద్యోగుల్లో కొన్ని చోట్ల పని ఒత్తిడి అధికంగా ఉండటం, మరికొన్ని చోట్ల తక్కువ పని ఉండటం సరికాదని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. దీన్ని క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications