టీటీడీ బోర్డులో ఆ ఎమ్మెల్యేలకు స్థానం- కేబినెట్ ఏర్పాటు లెక్కల్లో : శివసేన నేత- తెలంగాణ నుంచి వీరికే..!!
ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మొత్తం 75 మందితో బోర్డు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా రెగ్యలర్ సభ్యులుగా 25 మంది.. ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది వరకు ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా...25 మందిలో ఏపీతో పాటుగా సరిహద్దు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఏపీలో గతంలో ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదని తీసుకున్న నిర్ణయంలో ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలకు కొందరికి అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మల్లాడి కి ఖరారు...వీరితో సహా
అందులో భాగంగా సీఎం జగన్ యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి క్రిష్ణారావుకు టీటీటీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పిస్తూ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడుగా ఉన్నారు. జగన్ సీఎం అయిన తరువాత ఆయనతోనూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక, ఏపీ నుంచి గత బోర్డులో సభ్యులుగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి కి తిరిగి ఛాన్స్ ఖాయమైంది. అదే విధంగా గత పాలక మండలిలో సభ్యుడుగా ఉన్న ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కు తిరిగి ఛాన్స్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం.
అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకూ ఛాన్స్
వైసీపీ ఎమ్మెల్యేల్లో తొలి నుంచి జగన్ తోనే ఉన్న ప్రస్తుత పాయకరావు పేట ఎమ్మెల్యే గోర్ల బాబురావుకు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటుగా ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే మధు సూధన్ యాదవ్ పేరు సైతం ఖరారు అయినట్లుగా సమాచారం. ఇక, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు సైతం జగన్ ఆమోద ముద్ర వేసినట్లు చెబుతున్నారు. ఆయన గత పాలక వర్గంలోనే సభ్యుడిగా అవకాశం కల్పించాలని కోరారు.
శివసేన..తెలంగాణ నుంచి వీరికి అవకాశం
ఇక, మహారాష్ట్ర నుంచి సీఎం థాక్రే సిఫార్సు మేరకు శివసేన కార్యదర్శిగా ఉన్న మిలింద్ కు టీటీడీ బోర్డులో పేరు ఖరారైందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి గత బోర్డులో సభ్యులుగా ఉన్న జూపల్లి రామేశ్వరరావు, మూరంశెట్టి రాములుకు తిరిగి రెన్యువల్ కానుంది. అదే విదంగా కల్వకుర్తి విద్యాసాగర్.. వ్యాపార ప్రముఖుడు పార్ధసారధి రెడ్డి, లక్ష్మీ నారాయణ పేర్లు సైతం ఖరారైనట్లు సమాచారం. కర్ణాటక నుంచి పోకల అశోక్ కుమార్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఆయన తో పాటుగా శశిధర్ , అదే విధంగా ఆ రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న విశ్వనాధ రెడ్డి పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
స్టాలిన్ సిఫార్సు చేసిన వారిలో..
ఇక, తమిళనాడు నుంచి సీఎం స్టాలిన్ చేసిన సిఫార్సు మేరకు ఎమ్మెల్యే నంద కుమార్, కన్నయ్య పేర్లు ఖరారు చేసినట్లుగా సమాచారం. అయితే, కన్నయ్య పేరు పైన తాజాగా వివాదం కనిపిస్తోంది. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యే లకు అవకాశం కల్పించటం ద్వారా రానున్న రోజుల్లో జరిగే కేబినెట్ విస్తరణ ను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి పదవి రేసులో ఉన్న వారికి.. ఎవరికైతే ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేని వారికి టీటీడీలో అవకాశం ఇవ్వటం ద్వారా వారికి గుర్తింపు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
Recommended Video
ఆశావాహుల చివరి ప్రయత్నాలు..
చివరి నిమిషంలో చోటు చేసుకొనే మార్పులు - చేర్పుల ఆధారంగా ఈ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. రెండు విడతలుగా టీటీడీ బోర్డు జాబితా విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ సాయంత్రానికి 25 మంది సభ్యుల జాబితా విడుదలకు అవకాశం కనిపిస్తోంది. దీంతో..టీటీడీ బోర్డులో స్థానం ఆశిస్తున్న ఆశావాహులు తమ చివరి ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసారు. అయితే, జగన్ ఇప్పటికే లిస్టు ఫైనల్ చేయటంతో నేరుగా సీఎం ను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.