ఢిల్లీకి సీఎం జగన్: అమిత్ షాతో భేటీ :కేంద్ర మంత్రులతోనూ సమావేశం..!
ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధానితో సమావేశమయ్యారు. ఏపీలో పరిస్థితులను వివరించారు. పీపీఏల వ్యవహారం తో పాటుగా రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరంలో జరిగిన ఆదా గురించి వివరించారు. ఆ తరువాత ఆయన అమిత్ షా తో భేటీ కావాల్సి ఉన్నా సాధ్య పడలేదు. మరో సారి అమిత్ షా తో అప్పాయింట్ మెంట్ ఖరారైనా..చివరి నిమిషంలో రద్దైంది. మహారాష్ట్ర..హర్యానా ఎన్నికల కారణంగా అమిత్ షా బిజీగా ఉండటంతో పర్యటన వాయిదా పడింది. ఇక, సోమవారం తిరిగి ముఖ్యమంత్రి జగన్ కు అప్పాయింట్ మెంట్ ఖరారు అయింది. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్దిక..జలవనరులు..ఉక్కు..పర్యవరణ శాఖల మంత్రులను కలవనున్నారు. మంగళవారం సైతం ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండే ఛాన్స్ ఉంది. ప్రధాని అప్పాయింట్ మెంట్ సైతం కోరినట్లుగా సమాచారం.
ఢిల్లీలో అమిత్ షా తో జగన్ భేటీ..
ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఉదయం తొలుత పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీ వెళ్తారు. రెండు సార్లు వాయిదా పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ సోమవారం ఖరారైంది. ఆయనతో సమావేశం సమయంలో ఏపీలోని పరిస్థితులతో పాటుగా..రాజకీయ అంశాల పైన చర్చ చేయనున్నారు. ప్రధానంగా కేంద్రం నుండి పీపీఏల సమీక్ష పైన వస్తున్న అభ్యంతరాలు..ఏపీలో ప్రస్తుతం డిస్కింల ఆర్దిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి వివరించనున్నారు. అదే విధంగా కేంద్రం నుండి పెండింగ్ లో ఉన్న పోలవరం రీయంబర్స్ మెంట్ నిధులను సైతం విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరనున్నారు.

ఏపీకి రెవిన్యూ లోటు నిధులు.. రాజధానికి ఆర్దిక సాయం.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు.. వెనుకబడిన జిల్లాల డెవలప్ మెంట్ ఫండ్ కేటాయింపు వంటి వాటి గురించి విభజన చట్టం నోడల్ శాఖగా ఉన్న హోం శాఖ చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితులను వివరించటంతో పాటుగా రాజకీయ అంశాల పైనా చర్చించనున్నట్లు సమాచారం. తాజాగా రైతు భరోస పధకంలో ప్రధాని పేరును సైతం జోడించిన తరువాత..జరగబోయే భేటీ కావటంతో ఇది అధికారికంగానే కాకుండా రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ..
ఇదే పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ భేటీ కానున్నారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమై ఏపీలోని ఆర్దిక కష్టాలను వివరించి సాయం చేయమని కోరనున్నారు. వెంటనే రెవిన్యూ లోటు నిధులను భర్తీ చేయాలని అభ్యర్ధించనున్నారు. ఇక, రాజధానికి నిధులు విడుదల చేయాల్సిన అవసరం..ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల విషయాల పైన నిర్మలా సీతా రామన్ తోనూ ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఇక, కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి పోలవరంలో తాము తీసుకున్న నిర్ణయాలు..రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజల సొమ్మ ఏ మేర ఆదా అయందనే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించనున్నారు.
విజయవాడ కేంద్రంగా పోలవరం మీద సమీక్ష ఏర్పాటు చేసి..అన్ని అనుమానాలను పరిష్కరించే దిశగా చొరవ తీసుకోవాలని సీఎం జగన్ కోరనున్నారు. వచ్చే నెల నుండి పోలవరం పనులు ప్రారంభం కావాల్సి ఉండటంతో..కొత్తగా టెండర్ దక్కించుకున్న మేఘా సంస్థకు పనులు అప్పగించేలా లైన్ క్లియర్ చేయటం కోసం ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో ఆమోదం తీసుకోనున్నారు. ఇక, ప్రధాని అప్పాయింట్ మెంట్ సైతం జగన్ కోరినట్లుగా తెలుస్తోంది. మంగళవారం సైతం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలోనే ఉంటుండటంతో ప్రధాని అప్పాయింట్ మెంట్ ఖరారైతే ఆయనతోనే మరోసారి సమావేశమై తాజా పరిస్థితులను వివరించనున్నారు.












Click it and Unblock the Notifications