ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట - పది కాలాలు గుర్తిండిపోవాలి : కొత్త జిల్లాలపై సీఎం జగన్..!!
ఏపీలో కొత్త జిల్లాల్లో పరిపాలనా వ్యవహారాల పైన సీఎం జగన్ కీలక సూచనలు చేసారు. కొత్త జిల్లాల కసరత్తు.. కార్యాచరణ పైన సీఎం సమీక్షించారు. ఏప్రిల్ 4న కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అదే విధంగా కొత్త రెవిన్యూ డివిజన్లను ఖరారు చేసారు. ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ తరువాత ఇప్పటి వరకు ఫిర్యాదులు..అభ్యంతరాలు..వాటి పైన తీసుకున్న చర్యలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ప్రజలనుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయన్న అధికారులు..మెజార్టీ అభిప్రాయాల మేరకు మార్పులు చేర్పులు చేశామని చెప్పారు.
ఉద్యోగుల విభజనలో
స్థానికంగా చర్చలు చేసిన తరువాతనే జిల్లాల నుంచి కలెక్టర్లు తుది మార్పుల కోసం సిఫార్సులు చేసారని వివరించారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులు.. అధికారుల సిబ్బంది కేటాయింపు పైన సీఎం ఆరా తీసారు. సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్ పాయింట్ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామని అధికారులు నివేదించారు.
అన్ని విషయాలు పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనాయంత్రాంగం నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేశామని అధికారులు నివేదిక ఇచ్చారు. కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్ బుక్స్ కూడా తయారు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో
నూతన వెబ్సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు.. తదితర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అధికారులు సీఎం జగన్ కు ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారుచేశామని వివరించారు.
సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికిన తీసుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. దీని పై స్పందించిన సీఎం జగన్.. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.
Recommended Video
పది కాలాలు గుర్తుండేలా నిర్మాణాలు
కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలి సూచించారు. ప్రతీ జిల్లాలోనూ కార్యాలయాల కోసం కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని నిర్దేశించారు. కలెక్టర్తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసారు.
క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్ను సిద్దం చేసుకోవాలన్నారు. భవనాలకోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలని.. పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేసారు.