ఎమ్మెల్యేలనే జగన్ కలవరు - బెదిరిస్తే భయపడం: సీఎం కారు పెట్రోలుకు డబ్బుల్లేవు- రఘునందన్ ఫైర్..!!
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మాటలు పేలుతున్నాయి. అసలు కేంద్రం నిధులు ఇవ్వకపోతే సీఎం కారు పెట్రోలుకు కూడా డబ్బుల్లేవు అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బద్వేలు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. దీనికి వైసీపీ నేతలు సైతం అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మొదలు ప్రచారానికి వచ్చిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం తీవ్ర వ్యాఖ్యలతో టార్గెట్ చేసారు.
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ
బద్వేలు ప్రచారంలో భాగంగా చివరి రోజున రెండు పార్టీల నేతలు పోటీ పడి విమర్శలు చేసుకున్నారు. ఏపీలో రాజధాని ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన రఘునందన్ వ్యాఖ్యానించారు. కడపనే కొత్త రాజధాని చేస్తారా అంటూ ప్రశ్నించారు. కేంద్రం నిధులు రాకుంటే సీఎం జగన్ కారుకు పెట్రోలుకు కూడా ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ఎద్దేవాచేశారు. బద్వేలు బై పోల్ లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. సంపూర్ణ మద్యనిషేధం చేస్తామని చెప్పి.. రూ.100 ఉన్న బీరును 200 చేశారంటూ రఘునందన్ విమర్శించారు.
జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
మద్యం రేటు పెరిగితే తాగే వాళ్లు మానుకుంటారని చెప్పడం అవివేకమన్నారు. ఈయనో జీవో తెస్తాడు.. అది కోర్టు కొట్టేస్తుంది. ఈయనో మాట చెబుతారని... ఎవరో కోర్టుకు పోతారంటూ.. అక్కడ కొట్టేస్తారని రఘునందన్ వ్యాఖ్యానించారు. అసలిక్కడ పరిపాలన అనేది ఉందా...మీకు సలహాదార్లు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. మీరు తెచ్చిన ఒక్క పథకమైనా ప్రజలకు చేరుతోందా అంటూ ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలంటూ రఘునందన్ వ్యాఖ్యానించారు. కేంద్రం ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటోందని విమర్శించారు.
మంత్రులు - ఎమ్మెల్యేలను జగన్ కలవరు
సొమ్ములు కేంద్రానివి, ప్రచారం చేసుకునేది జగన్ అంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కోడికత్తులు కనిపించిన జగన్కు అధికారంలోకి రాగానే ఏ కత్తులు కనిపించాయో కానీ ప్రజలకు మాత్రం బాగా దూరమయ్యారంటూ ఆరోపించారు. ప్రజలను- ఎమ్మెల్యేలను కలవరని..చివరకు మంత్రులను కలవరంటూ విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఎత్తుకుని పోవాలని చూడడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు.
Recommended Video
మీలాగా బెదిరించాలంటే మా దగ్గర..
మీలాగా మేమూ బెదిరించాలనుకుంటే మీ దగ్గర 13 జిల్లాల పోలీసులు మాత్రమే ఉన్నారంటూనే..తమ దగ్గర స్పెషల్ పోలీసులు.. సీఆర్పీఎఫ్ 30 రకాల పోలీసులున్నారన్నారు. బెదిరిస్తే భయపడే వారెవరూ లేరంటూ రఘునందన్ పేర్కొన్నారు. ఇక, బద్వేలులో ప్రచారం ముగిసింది. ఈ నెల 30న పోలింగ్..నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. అయితే, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చేసిన తీవ్ర వ్యాఖ్యల పైన వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని పైన వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.