నాడు వైయస్సార్ ..నేడు జగన్: ఆ మచ్చ చెరిపేందుకే..: ప్రత్యర్దులకు సైతం రెడ్ కార్పెట్..!
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక నేతల పార్టీ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అందునా..కడప జిల్లా నుండి చోటు చేసుకుంటున్న చేరికలు వైసీపీ నేతలకే ఆశ్చర్యంగా మారాయి. అసలు..జగన్ వారిని చూసేందుకు కూడా ఇష్టపడని వారని..అటువంటి వారికి ఇప్పుడు సొంత పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించటం పై ఆసక్తి కర చర్చ సాగుతోంది. నాడు వైయస్సార్ హయాంలోనే సతీష్ రెడ్డి తన తండ్రి హత్య కేసులో ముద్దాయి అయినా...తాము ఎటువంటి ప్రతీకార చర్యలకు పోలేదని పదే పదే చెప్పేవారు. ఇప్పుడు అదే సతీష్ రెడ్డి వైసీపీలో చేరటానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అదే విధంగా జమ్మల మడుగులోనూ రాజకీయ వర్గ పోరు రెండు వైపులా నష్టం చేసింది. అయితే, నాడు వైయస్ తరహాలోనే జగన్ ఇప్పుడు ముందుకు కదులుతున్నారు. ఫ్యాక్షన్ రాజకీయలకు ముగింపు పలికేందుకు ఒక అడుగు వెనక్కు తగ్గుతున్నారు. తన మీద రాజకీయ విమర్శల్లో భాగంగా..వేస్తున్న మచ్చలను చెరిపివేసే ప్రయత్నంతో పాటుగా..కొత్త తరహా రాజకీయాలకు ఇప్పుడు ఏపీ వేదికగా మారుతోంది.

నాడు వైయస్సార్ సీఎం అయిన వెంటనే...
నాడు వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఆయననూ ఫ్యాక్షన్ నేతగా విమర్శించేవారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తరువాత తన కోపం అనే నరాన్ని తెంచేశానని వైయస్ చెప్పుకొచ్చేవారు. ఇక, వైయస్ సీఎంగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న ఇద్దరు కీలక నేతల మధ్య తనంతటగా తాను రాజీ కుదిర్చి అక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేశారు. కర్నూలు జిల్లాలో కాటసాని, బిజ్జం కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ తగదాలు ఉన్నాయి. అయితే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న బిజ్జం వ్యాపారాలకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీ చేయాలని ప్రయత్నించారు. జగన్ సమక్షంలో వైసీపీలో సైతం చేరారు. అయితే, పాణ్యం సీటు కాటసాని రాంభూపాల్ రెడ్డికి వైసీపీ అధినేత కేటాయించారు. దీంతో..నాడు వైయస్సార్ కుదిర్చిన రాజీతో ఆ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ సమిసిపోయింది.

చంద్రబాబు సమయంలో జమ్మలమడుగులో..
ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2019 ఎన్నికలకు ముందు జమ్మలమడుగులో కీలక నేతలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి జమ్మలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బా రెడ్డి మీద గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. దీనిని రామసుబ్బారెడ్డి వర్గం జీర్ణించుకోలేక పోయింది. ఆ తరువాత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక, 2019 ఎన్నికల్లో ఇద్దరి మధ్య రాజీ చేసి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా..రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేలా చంద్రబాబు ఒప్పించారు. దశాబ్దాలుగా ఉన్న వర్గ విభేదాలను పక్కన పెట్టి తొలి సారి అదే సమయంలో ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీ నుండి అభ్యర్ధులుగా పోటీ చేశారు. ఇక, ఇప్పుడు తొలి నుండి వైయస్సార్ సమయం నుండి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న రామసుబ్బారెడ్డి కుటుంబం ఇప్పుడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతోంది. ఇక, కర్నూలు జిల్లాలో కేఈ..కోట్ల కుటంబాల మధ్య సైతం రాజకీయంగా అప్పట్లో చంద్రబాబు సఖ్యత కోసం ప్రయత్నించారు.
Recommended Video


ఇప్పుడు ఏకంగా సతీష్ రెడ్డిని ఆహ్వానించటం ద్వారా...
జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం.. కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారు...రౌడీయిజం ప్రోత్సహిస్తారు అంటూ పదే పదే టీడీపీ నేతలు చేసే విమర్శలకు ముగింపు పలకటానికి..ప్రజల్లో అదే సమయంలో ఒక్క సారిగా పాజిటివ్ ఇమేజ్ పెంచటానికి..తనకు రాజకీయ ప్రత్యర్ధులే కానీ..వ్యక్తిగత శత్రువులు లేరని చెప్పే విధంగా తాజాగా కడప జిల్లా నేతలను జగన్ తమ పార్టీలోకి స్వాగతిస్తున్నారు. తన తండ్రి రాజారెడ్డి హత్యలో పాత్ర ధారిగా ప్రచారంలో ఉన్న సతీష్ రెడ్డిని జగన్ వైసీపీలోకి ఆహ్వానిస్తుండటం స్థానికంగా కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం ద్వారా..జగన్ తన పట్ల జరుగుతున్న ప్రచారం తప్పనే సంకేతాలను ఇవ్వటంతో పాటుగా..సీఎం పదే పదే చెప్పే ఈ జనరేషన్ లీడర్ గా ఉంటాననే విధంగా ఇప్పుడు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ఈ నిర్ణయాల ద్వారా పూర్తిగా రాజకీయ వైరం మినహా వ్యక్తిగత వైరం దూరం కానుందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇదే తరహాలో సమస్యలు ఉన్న ప్రాంతాల్లోనూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications