సీఎం జగన్ కు ఇంకా మూడు నెలలే సమయం : మాట నిలబెట్టుకుంటారా: ఏం జరుగుతోంది..!!
మే 23, 2019. ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడించి ఘన విజయం సాధించిన వీరుడిగా జగన్ పేరు నిలిచిన రోజు. అదే రోజు జగన్ సాయంత్రం సమయంలో తన నివాసం వద్ద కార్యక్తలకు సందేశం ఇచ్చారు. తాను ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి..ఆరు నెలల కాలంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తమకు దిక్సూచీ అని ప్రకటించారు. ఆ తరువాత మే 30న జగన్ అనే నేను అంటూ..ఉద్వేగ పూరితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. తరువాత పది రోజుల్లోగా కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు. పాలన ప్రారంభించారు. ముఖ్యమంత్రి గా జగన్ వంద రోజులు పూర్తయింది. అంటే మూడు నెలలకు పైగా సమయం ముగిసింది. మరి..జగన్ ఈ మూడు నెలల కాలంలోనే అభినందనలు..ఆరోపణలు ఎదుర్కొన్నారు. కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతు న్న సీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో సంచలన బిల్లులను ఆమోదించి సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, డెవలప్ మెంట్ పరంగా మాత్రం జగన్ ఆశించిన పురోగతి సాధించలేదు. దీంతో..మరి జగన్ మంచి ముఖ్యమంత్రిగా అభిప్రాయం కలిగించలుగుతున్నారా...
అభినందనలు..ఆరోపణలు
తొలి శాసనసభా సమావేశాల్లోనే పార్టీ ఫిరాయింపుల మీద స్పష్టమైన ప్రకటన చేసారు. ఇక, కేబినెట్ కూర్పులో అమలు చేసిన సామాజిక సమీకరణాలతో జగన్ మంచి ఇమేజ్ సాధించారు. అయితే, పార్టీలో ఆ సమయంలో సీనియర్లను పక్కన పెట్టారనే భావన ఉన్నా..వారికి జగన్ భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. ఇక, ప్రజా వేదిక కూల్చటం.. కరకట్ట మీద చంద్రబాబు నివాసంతో పాటుగా మిగిలిన నిర్మాణాల కూల్చివేత పైన నోటీసులు జారీ చేయటం తొలి విమర్శకు కారణమైంది. జగన్ కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలకు కారణమైంది. ఇక, విద్యుత్ కొనుగోళ్ల ప్రాజెక్టుల సమీక్ష్...పోలవరం పనులు నిలిపివేత. .రాజధాని పనులు ఆపివేయటం ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేయటానికి కారణమయ్యాయి. వీటితో పాటుగా ఇసుక సమస్య..అన్నా క్యాంటీన్ల మూసివేత ప్రభుత్వం మీద క్షేత్ర స్థాయిలో కొంత వ్యతిరేకత తీసుకొచ్చిందనేది వాస్తవం. సచివాలయ పరీక్షలు..ఉద్యోగాల కల్పనకు విశేష స్పందన వచ్చింది. అవినీతి రహిత పాలన అని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో అది పూర్తిగా అమలు కావటం లేదు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు మాత్రం లేవు. ఇసుక సమస్యను తాజాగా ప్రభుత్వం కొత్త పాలసీతో ప్రజల ముందుకు వచ్చింది. ఇక మద్య పాన నిషేధం దిశగా అడుగులు.. దీంతో పాటుగా ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం విలీనం చేయటం ద్వారా జగన్ ఇచ్చిన హమీలను అమలు చేస్తున్నారనే భావన కలిగించటంలో సక్సెస్ అయ్యారు.
మంచి సీఎంగా జగన్ నిలుస్తున్నారా..
మంచి సీఎంగా జగన్ అనిపించుకోవటానికి ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు దోహదం చేస్తున్నాయా. ఇంకా చేయాల్సింది ఉందా. జగన్ తనకు తానుగా ఫిక్స్ చేసుకున్న సమయం ఆరు నెలలు. అందులో మూడు నెలలు పూర్తయింది. జగన్ పూర్తిగా భవిష్యత్ రాజకీయాలను పరిగణలోకి తీసుకొని..అదే విధంగా తన హామీల అమలు కోసం సంక్షేమం మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కొత్త రాష్ట్రంగా సంక్షేమం తో పాటుగా డెవలప్ మెంట్ సైతం ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు. కానీ, ఈ మూడు నెలల కాలంలో ఆ దిశగా జగన్ ఒక్క నిర్ణయం చేయలేదు. కొత్తవి లేకపోగా..పోలవరం .. అమరావతి పనులు నిలిపవేయటం పైన ప్రతిపక్షాలు అవకాశంగా మలచుకుంటున్నాయి. దీంతో పాటుగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని చెప్పారు. ఇక, ఇప్పుడు అవినీతి కారణంగానే పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామని ప్రకటించారు. రాజధాని పనుల మీద సమీక్ష చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
సీఎం ను కలిసే అవకాశం
అయితే, ఏ ఒక్క విషయంలోనూ నాటి ప్రభుత్వ అవినీతి పైన ఏ ఒక్క రిపోర్టు బయట పెట్టకపోవటం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, పార్టీ పరంగా సీనియర్లు ప్రాధాన్యత లేదనే భావన వినిపిస్తోంది. కొంతమంది అధికారుల కారణంగా పార్టీ ఎమ్మెల్యేలకే సీఎం ను కలిసే అవకాశం రావటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రజా దర్భార్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పాటుగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి..జగన్ కు మరో మూడు నెలల సమయం ఉంది. ఈ లోగా తాను అన్ని రంగాలను..అన్ని ప్రాంతాల డెవలప్ మెంట్ కోసం ఉన్నానని చెప్పే సీఎం ఆచరణలోనూ అదే విధంగా మంచి సీఎం అని పిలిపించుకోగలుగుతారా లేదా అనేది మరో మూడు నెలల కాలంలో తేలి పోనుంది.