సీఎం నంద్యాల పర్యటన వాయిదా - అసలు కారణం అదేనా : ఆ పధకం పైనా ప్రభావం..!!
సంక్రాంతి సమయంలో ముఖ్యమంత్రితో అట్టహాసంగా నిర్వహించాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. ముఖ్యమంత్రి జగన్ సోమవారం కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనకు రావాల్సి ఉంది. అయితే, సీఎం జగన్ పర్యటన వాయిదా వేసారు. దీని వెనుక అసలు కారణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సీఎం జగన్ నంద్యాల కేంద్రంగా ఈబీసీ నేస్తం పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ నెల 10వ తేదీన ముహూర్తంగా ఖరారు చేసారు. దీని ద్వారా 45 సంవత్సరాలు దాటిన ఓసీ మహిళలకు (కాపులు మినహా) ఏటా రూ.15వేలు అందించాలని నిర్ణయించారు.

భారీగా నిర్వహణకు నిర్ణయించినా
ఈ పథకానికి రూ.600 కోట్ల నుంచి రూ.650 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఏ పథకం నిధులు ఏ రోజున విడుదల చేసేదీ ముందుగానే చెబుతూ..అదే రోజున తాను చెప్పిన విధంగా పధకాలు అమలు చేస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఎంత ప్రయత్నించినా.. నిధుల సీమకరణ సాధ్యం కాకపోవటంతో కార్యక్రమం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో పాటుగా.. ఆర్దిక మంత్రి నిర్మలా సీతా రామన్ ను కలిసి తమకు రుణ పరిమితి పెంపుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఆర్దికంగా అడ్జస్ట్ మెంట్ కుదరక
అదే రోజున ఆర్బీఐ లో బాండ్ల వేలం ద్వారా రూ 2500 కోట్ల రుణ సమీకరణ చేసారు. కానీ, వేతనాలు..పెరిగిన సామాజిక పెన్షన్ల ఖర్చు తో ఈ నిధులు మొత్తం అడుగంటాయి. కేంద్రం నుంచి రెవిన్యూ లోటు భర్తీలో భాగంగా మరో రూ 1,300 కోట్ల నిధులు కేటాయించారు. అయితే, తొలి వారంలో చేయాల్సిన చెల్లింపులు .. సర్దుబాట్లతో ఈ పధకం కింద చెల్లింపులకు సమయం సరిపోలేదని తెలుస్తోంది.
అదే సమయంలో ఇతరత్రా అప్పుల కోసం ప్రయత్నించినా.. సాధ్యపడలేదు. అనుకున్న సమయానికి నిధులు అందకపోవటంతో కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు ద్వారా ఈ పధకం ప్రారంభించాలని భావించినా..చివరి నిమిషంలో వాయిదా తప్పలేదని తెలుస్తోంది.

పండుగ రోజుల్లో నిర్వహణ ఆలోచనలు
అయితే, తిరిగి ఈ పధకం ఎప్పుడు ప్రారంభించేదీ ప్రకటించాల్సి ఉంది. ఇక, ఇదే సమయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను కలిసి అప్పుల పరిమితి పెంపు కోసం సీఎం చేసిన అభ్యర్ధనలకు కొనసాగింపుగా కేంద్రం కరుణించి అనుమతిస్తే... మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని, రుణం సేకరించే అవకాశం ఉంది.

ఈ నెలలోనే విడుదల చేస్తామంటూ
ఆ మొత్తంతో ఈబీసీ నేస్తం పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, గురువారం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం రూ.1430 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బులతో ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తారని అంతా భావించారు. అయితే, పెన్షన్లు రూ 250 చొప్పున పెంచటంతో ఈ నెల గతం కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చింది. మంగళవారం ప్రభుత్వం ఆశించిన విధంగా నిధులు సమకూరితే పండగ రోజుల్లోనే ఈబీసీ నేస్తం విడుదల చేసే అవకాశం ఉంది. సాధ్యం కాకుంటే... ఈ నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications