సీఎం జగన్ గుర్తించారు : ఇక ప్రజలు - ఎమ్మెల్యేలతో నిత్యం భేటీలు: ముహూర్తం ఫిక్స్..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. మూడేళ్ల కాలంగా సీఎం సొంత పార్టీ నేతలకు నేరుగా కలిసే అవకాశం ఇవ్వటం లేదనే ఆవేదన పార్టీ నేతల్లో ఉంది. అదే విధంగా సాధారణ ప్రజలను సైతం సైతం కలుస్తారని సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో చెప్పారు. మూడేళ్లు అయినా అది అమలు కాలేదు. ఇక, సామాన్య ప్రజలు స్పందన ద్వారా తమ సమస్యలను విన్నివించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ సమయంలో..ఇక పార్టీ నేతల్లో ఉన్న ఆ అభిప్రాయాన్ని తొలిగించటంతో పాటుగా.. వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను - క్షేత్ర స్థాయిలో పార్టీ అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పాటుగా సామాన్య ప్రజానీకానికి సీఎం అందుబాటులో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

సీఎం జగన్ ప్రజాదర్బార్
ఇందు కోసం తన తండ్రి తరహాలో నిత్యం ప్రజా దర్బార్ ద్వారా సామాన్య ప్రజలకు తనను కలుసుకొని సమస్యలు విన్నవించుకోవటం.. మధ్నాహ్నం సమయంలో రెండు నుంచి మూడు గంటల పాటు పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలకు అప్పాయింట్ మెంట్స్ ఇవ్వనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి సీఎం ప్రజాదర్బార్ అధికారికంగా ప్రారంభం కానుంది. గతంలోనే ఈ తరహా ఆలోచన చేసినా.. అమలు కాలేదు.
ఇక, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. ప్రజలతో పాటుగా పార్టీ నేతలతో నేరుగా సమావేశాలు నిర్వహించటం ద్వారా వారితో మమేకం అవ్వటంతో పాటుగా క్షేత్ర స్థాయి సమస్యలు - వాస్తవాలు నేరుగా సీఎం తెలుసుకొనే అవకాశం ఏర్పుడుతుందని చెబుతున్నారు. తనకు కలిసే అవకాశం రావటం లేక, ఎమ్మెల్యేలు - పార్టీ నేతలు లోలోపల అసంతృప్తితో ఉన్నారని సీఎం గుర్తించారు.

అటు ప్రజలతో..ఇటు పార్టీ నేతలతో
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఉదయం వేళ క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తమ సమస్యల అర్జీలతో భారీ సంఖ్యలో సాధారణ ప్రజలు వచ్చే వారు. సీఎం ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్లి..వారి దరఖాస్తుల ను స్వీకరించే వారు. ఆవేదనతో.. సమస్యలతో వచ్చిన వారికి ఓదార్పు ఇచ్చేవారు. నాడు వైఎస్సార్ కు స్వయంగా వచ్చిన అర్జీలను ఖచ్చితంగా పరిష్కరించే వారు.
ఇందుకోసం సీఎంఓలో ఇద్దరు అధికారులకు బాధ్యతలు చూసి.. సంబంధింత అధికారుల ద్వారా పరిష్కరించేలా సూచనలు చేసేవారు. ఇప్పుడు సైతం ఇదే తరహాలో..ప్రజాదర్బార్ ద్వారా తన వద్దకు వచ్చిన అర్జీల పరిష్కారం కోసం సీఎంఓలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రతీ రోజు మధ్నాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పార్టీకే సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.

పాలనా - పార్టీ అంశాలపై సీఎం ఫోకస్
ఇప్పటికే ఎమ్మెల్యేలకు నియోజకవర్గ వర్గ నిధుల కింద ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్దమని హామీ ఇచ్చారు. దీంతో పాటుగా క్షేత్ర స్థాయిలో నియోజకవర్గంలో ఉన్న పాలనా పరమైన అంశాలతో పాటుగా పార్టీలోని సమస్యలు.. అంతర్గత విభేదాలు.. సమన్వయం పైనా సీఎం ఫోకస్ పెట్టనున్నారు.
ఎన్నికల దిశగా అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న వేళ.. సీఎం జగన్ ప్రజాదర్బార్ నిర్ణయంతో పాటుగా రాజకీయంగా పార్టీకి మేలు చేస్తుందని..పార్టీ నేతల్లో కొత్త జోష్ వస్తుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రజాదర్భార్ నిర్వహించి..తన వద్దకు వచ్చిన ప్రతీ అంశాన్ని పాలనా పరంగా - రాజకీయంగా పరిష్కరించేలా సీఎం అడుగులు వేసేందుకు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications