దిద్దుబాటుకు ప్రభుత్వం సిద్దం - అన్యాయం జరగనీయను : సీఎం జగన్..!!
తమ ప్రభుత్వంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. రైతుల కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాం లో రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసారని గుర్తు చేసారు. రైతు పక్షపాత ప్రభుత్వంగా తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
ఈ మూడున్నారేళ్ల పాలనలో ఎక్కడా కరువు అనే మాల లేదని..ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. రైతులకు అందిస్తున్న ప్రయోజనాల విషయంలో ఎక్కడైనా అర్హులకు అందక పోతే ఫిర్యాదు చేయవచ్చన్నారు. సరిదిద్ది..వారికి అండగా నిలిచేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
సున్నా వడ్డీ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ. 1834.55 కోట్లు వడ్డీ రాయితీని అందించాం. #YSRSunnaVaddi #YSJaganWithAPFarmers pic.twitter.com/CrpPgZxhxP
— YSR Congress Party (@YSRCParty) November 28, 2022
ముఖ్యమంత్రి జగన్ రబీ 2020-21, ఖరీఫ్-2021 సీజన్లకు చెందిన వైయస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్-2022 సీజన్లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు జమ అయ్యేలా నిధులు విడుదల చేసారు. రబీ 2020-21 సీజన్లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్-2021 సీజన్లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమచేసారు.
అదే విధంగా ఖరీఫ్-2022 సీజన్లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఖరీఫ్ సీజన్ ముగియక ముందే జమచేస్తున్నట్లు వెల్లడించారు. ఇక గడిచిన మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమచేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 21.31 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.79 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం అందించిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
బాబు తన ఐదేళ్ళ పాలనలో రుణమాఫీ కింద రూ.15వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మన ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఒక్క రైతు భరోసా పథకం ద్వారా రైతుల కోసం రూ.25,971 కోట్లు ఖర్చు చేశాం. #YSJaganWithAPFarmers #YSRSunnaVaddi pic.twitter.com/JwYaFkiG9p
— YSR Congress Party (@YSRCParty) November 28, 2022
ఈ మూడేళ్ల కాలంలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ములు చేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందించారు. మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం అందినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాం లో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ.. సున్నా వడ్డీ రాయితీ వంటివి గతం ప్రభుత్వంలో అమలు కాలేదని గుర్తు చేసారు. రైతులకు సాయం విషయంలోనూ గత పాలకులు పట్టించుకోవటమూ కరువయిందన్నారు.