నేనున్నా, పూర్తి సహకారం అందిస్తా - సీఎం జగన్ అభయం..!!
విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదనేది తన ఉద్దేశమని సీఎం జగన్ పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వీరందరికీ టాప్ 50 యూనివర్సిటీల్లో 21 ఫ్యాకల్టీలో సీట్లు ఎక్కడా వచ్చినా అప్లికేషన్ పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసి తోడుగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రపంచంలోనే టాప్-50 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
నిధులు విడుదల
అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారులకు సీఎం జగన్ విడుదల చేసారు. వివక్షకు తావులేకుండా అర్హులైన విద్యార్థులను సాచ్యురేషన్ పద్ధతిలో ఎంపిక చేసి వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అండగా నిలుస్తామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు రూ.1.25 కోట్ల వరకు ఫీజుల సపోర్టు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇతర నిరుపేద పిల్లలకు కూడా కోటి రూపాయల వరకు సపోర్టు చేసే కార్యక్రమం అమలవుతుందని వెల్లడించారు. ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు పెంచడం జరిగిందని చెప్పారు.
50 యూనివర్సిటీల్లో సీట్లు వస్తే
నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంపిక చేసిన 21 ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రపంచంలోనే టాప్-50 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. విదేశీ విద్యా దీవెన పథకంలో మార్పు తీసుకువచ్చి పారదర్శక పద్ధతిలో అమలు చేస్తున్నాం.
ఏ ఒక్కరికైనా అర్హత ఉండి టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీస్, దాదాపు 350 కాలేజీల్లో సీట్లు సాధించినా వారి చదువుకి ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తోందన్నారు. ఎవరు, ఏ బ్యాక్గ్రౌండ్, ఏ పార్టీ వారు అనేది కూడా చూడకుండా అత్యంత పారదర్శకంగా మన పిల్లలకు తోడుగా నిలుస్తున్నామని సీఎం వివరించారు.
అండగా నిలుస్తాం
ఈ పథకానికి పిల్లలందరికీ నాలుగు వాయిదాల్లో అందిస్తున్నాం. ఇమిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్థులకు మొదటి వాయిదా, మొదటి సెమిస్టర్ ఫలితాల అనంతరం విద్యార్థులకు రెండో వాయిదా, రెండో సెమిస్టర్ టర్మ్ ఫలితాలు విడుదల అనంతరం మూడో వాయిదా, విజయవంతంగా నాల్గవ సెమిస్టర్ పూర్తిచేసి మార్క్ షీట్ అప్లోడ్ చేసిన తరువాత చివరి విడతగా నాల్గవ వాయిదా ఇచ్చేలా స్కాలర్షిప్ ప్రోగ్రాంను డిజైన్ చేసి పిల్లలందరికీ తోడుగా ఉండే గొప్ప మార్పు జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications