కలాం పేరు తీసేసి వైయస్ పేరు పెట్టేసారు: అధికారుల అత్యుత్సాహం: సీఎం జగన్ ఏం చేసారంటే..!
Recommended Video
కొందరు ఏపీ అధికారుల అత్యుత్సాహం సమస్యలకు కారణమవుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని పధకాలకు వైయస్సార్ పేరు పెడుతోంది. ఇక, ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు మాజీ రాష్ట్రపతి కలాం పేరుతో కొనసాగిస్తోంది. అయితే, పాఠశాల విద్యా శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ పురస్కారాలకు కలాం పేరు తీసేసి వైయస్సార్ విద్యా పురస్కారంగా పేరు మార్చారు. ఇది విమర్శలకు కారణమైంది.
తనకు సమాచారం లేకుండా ఏకంగా కలాం పేరు మార్చేటయం పైన సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కలాం పేరు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. వెంటనే పేరు మారుస్తూ జారీ చేసిన జీవో రద్దు చేయాలని ఆదేశించారు. గతంలో లాగానే కలాం పేరుతోనే ప్రతిభా పురస్కారాలు కొనసాగించాలని స్పష్టం చేసారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటుగా ఇతర మహానీయుల పేర్లు కూడా అవార్డులకు జోడించాలని సూచించారు. మహాత్మగాంధీ, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్రాం వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేసారు. అయితే, అధికారుల అత్యుత్సాహం మీద ముఖ్యమంత్రి సీరియస్ గా స్పందించినట్లు సమాచారం.
పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్ధులకు ఇస్తున్న ప్రతిభా పురస్కారాలను ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికే అందించాలని విద్యా శాఖ నిర్ణయించింది. దీని పైన అభ్యంతరాలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వం దీని మీద ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా ఏకంగా అవార్డులకు కలాం పేరు స్థానంలో వైయస్సార్ పేరు ఖరారు చేసింది. ఇదే ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది.
గతంలో ఈ అవార్డు కింద మెరిట్ సర్టిఫికెట్.. మెమెంటో.. స్కాలరషిప్ ఇచ్చేవారు. అబ్దుల్ కలాం జయంతి అయిన నవంబర్ 11న వీటిని విద్యార్ధులకు ప్రధానం చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులకే ఇది అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వంతో పాటుగా ప్రయివేటు పాఠశాలల్లో చదివే వారికి సైతం ఈ అవార్డులిచ్చేది. దీంతో..ఎక్కువగా ప్రయివేటు విద్యార్ధు లకే ఈ అవార్డులు ఎక్కువగా దక్కేవి. దీంతో..ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని నిర్ణయించింది.
అయితే, అవార్డులను కలాం పేరును తీసేసీ వైయస్సార్ పేరు పెట్టటం పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో..అధికారులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో..ముఖ్యమంత్రి కలాం పేరు మార్చుతూ వైయస్సార్ పేరు ఖరారు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.