నేటి నుంచి సీఎం జగన్ విశాఖలో -గేమ్ ఛేంజర్...!!
సీఎం జగన్ విశాఖ చేరుకుంటున్నారు. రెండు రోజుల జీఐఎస్ గేమ్ ఛేంజర్ కానుంది.
ఏపీలో మార్చి నెల కీలకం కానుంది. విశాఖ కేంద్రంగా కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలో రెండు అంతర్జాతీయ సదస్సులకు విశాఖ వేదిక కానుంది. విశాఖే పరిపాలన రాజధానిగా ఉంటుందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అటు సుప్రీంకోర్టులో రాజధానుల కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో సీఎం జగన్ విశాఖలో క్యాంపు కార్యాలయం సిద్దం చేసుకొని..పాలనా వ్యవహారాల పర్యవేక్షణకు సిద్దం అవతున్నారని చెబుతున్నారు. ఈ సమయంలోనే నేటి నుంచి సీఎం జగన్ విశాఖలో మూడు రోజుల పాటు ఉండనున్నారు. రేపటి నుంచి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు జరగనుంది. పారిశ్రామిక దిగ్గజా లు విశాఖకు తరలి వస్తున్నారు. ఈ సదస్సు ఏపీలో గేమ్ ఛేంజర్ గా మారబోతోంది.

నేటి నుంచి విశాఖలో సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పాటు విశాఖలోనే ఉండనున్నారు. సాయంత్ర విశాఖ చేరుకోనున్న సీఎం..రాత్రికి రుషికొండలోని ఓ హోటల్ లో విడిది చేస్తారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు (జీఐఎస్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు గంటలకు ఎగ్జిబిషన్ ఎరేనాను ప్రారంభించనున్నారు. సాయంత్రం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు జీఐఎస్ అతిథుల కోసం గాలా డిన్నర్ ఏర్పాటు చేసారు.4వ తేదీన రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సులో భాగంగా..గంటన్నర పాటు ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. 11 గంటలకు వాలెడక్టరీ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు విశాఖ నుంచి తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం అవుతారు.

సిద్దమైన సాగర నగరం
పెట్టుబడిదారుల పండుగకు విశాఖ నగరం సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును అడ్వాంటేజ్ ఏపీ పేరుతో నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటారు. కేంద్ర - రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. మొత్తం 15 రంగాలకు సంబంధించి ఒప్పందాలు జరగనున్నాయి. 26 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. 8వేల మంది అతిథులు.. పెట్టుబడి దారులు ఈ సమావేశానికి తరలి వస్తున్నారు. 137 ఏపీ పెవిలియన్ స్టాల్స్ ఏర్పాటు చేసారు. తొలి రోజున ముఖ్యమంత్రి జగన్ ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ..పారిశ్రామిక వేత్తలకు ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రసంగం చేయనున్నారు. రెండో రోజుల ఏపీ ప్రభుత్వంతో పలు సంస్థల ఎంఓయులు జరగనున్నాయి. మొత్తం 9 రంగాల పైన తొలి రోజు సెషల్ లో చర్చలు జరగనున్నాయి. కీలక రంగాలకు సంబంధించి పలు దేశాల ప్రతినిధులతో సమావేశాలు కొనసాగనున్నాయి.

ఏపీలో గేమ్ ఛేంజర్ గా..
ఈ రెండు రోజుల సదస్సు గేమ్ ఛేంజర్ గా ప్రభుత్వంలోని మంత్రులు భావిస్తున్నారు. రాష్ట్రానికి దాదాపుగా 1.85 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సదస్సు కోసం పలు రాష్ట్రాల్లో రోడ్ షో లు నిర్వహించారు. పలువురు పారిశ్రామిక వేత్తలను మంత్రులు స్వయంగా ఆహ్వానించారు. అతిధుల కోసం విశాఖలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. మూడు ప్రత్యేక హెలిప్యాడ్స్ సిద్దం అయ్యాయి. ఒకే సారి 4వేల మంది భోజనం చేసే విధంగా హాల్ ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..విశాఖ కేంద్రంగా నిర్వహించే ఈ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్స కీలకంగా మారుతోంది. ఏపీకి పెట్టబడులతో పాటుగా ఉపాధి కల్పన పైన ఈ సదస్సులో ఒప్పందాలు జరగనున్నాయి. దీంతో..ఇప్పుడు అందరి చూపు విశాఖ పైనే నెలకొంది.












Click it and Unblock the Notifications