ఇబ్బంది తప్పదని కేసీఆర్ హెచ్చరిక, విషం చేతపట్టి ఓయులో ర్యాలీ
హైదరాబాద్: రబీలో విద్యుత్ కష్టాలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం హెచ్చరించారు. 2016 నాటికి ఛత్తీస్గఢ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ వస్తుందని చెప్పారు. 2018 నాటికి తెలంగాణ మిగులు విద్యుత్ సాధిస్తుందని చెప్పారు.
విద్యుత్ సరఫరాలో వ్యవసాయానికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి నాలుగు వేల మెగావాట్లుగా ఉంటే, డిమాండ్ ఆరువేల మెగావాట్లుగా ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి రెండువేల మెగావాట్ల విద్యుత్ తెస్తామన్నారు.
21,350 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రానికి లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. కాలపరిమితితో కూడిన ప్రణాళికతో అధికారులు పని చేయాలని సూచించారు. జల విద్యుత్ సహా రాష్ట్రంలో 24వేల మెగావాట్ల విద్యుత్ లక్ష్యమని చెప్పారు.

రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
కేసీఆర్ రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 8న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. అదే రోజు ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశమవుతారు. మొత్తం పది మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్పత్రి తరలింపు నిర్ణయాన్ని మానుకోవాలి: వామపక్షాలు
సచివాలయం వాస్తు బాగోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సిగ్గుచేటు అని వామపక్ష నేతలు విమర్శించారు. ఆస్పత్రి తరలింపు నిర్ణయాన్ని కేసీఆర్ వెనకు తీసుకోవాలని వారు హితవు పలికారు. బుధవారం చెస్ట్ ఆస్పత్రిలో వామపక్ష నేతలు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వాస్తు అనేది వ్యక్తిగత నమ్మకమే తప్ప శాస్త్రం కాదని టీ సీపీఎం కార్యదర్శి తమ్మినేని అన్నారు. లౌకిక రాజ్యాంగం అమలులో ఉన్న భారతదేశంలో మూఢనమ్మకాలతో బిల్డింగ్ను కూల్చివేయడం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు.
మాటలతో కేసీఆర్ కోటలు: ఎర్రబెల్లి
కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలతో మాటలు కోటలు దాటుతున్నాయని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయలని డిమాండ్ చేస్తూ తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎర్రబెల్లి పాల్గొని, ప్రసంగించారు.
ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఆ విషయం మర్చిపోయారన్నారు. డీఎస్సీ విడుదల చేసి ఖాళీలు భర్తీ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.
విషం చేతపట్టి ఉస్మానియా విద్యార్థుల ర్యాలీ
చేతిలో విషం సీసాలు పట్టుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బుధవారం ర్యాలీ చేపట్టారు. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చేతిలోని విషం సీసాలను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ వారు అడ్డుకున్నారు. కాగా, వారు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications