సిఎం భద్రతా సిబ్బంది వైఫల్యం...చంద్రబాబు పైకి దూసుకువచ్చిన బాలిక, అభిమానంతోనే!
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో డొల్లతనం స్పష్టంగా బైటపడింది. తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం ఆయన ఆలయ అధికారులతో కలిసి తమ కాన్వాయ్ వైపు వెళ్తుండగా ఓ బాలిక ఉన్నట్లుండి ఆయన వైపు దూసుకువచ్చింది.
అంతేకాదు రావడంతోనే ఒక్కసారిగా సీఎం చంద్రబాబును గట్టిగా హత్తుకోవడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయితే చంద్రబాబు మాత్రం ఏ మాత్రం కంగారు పడకుండా ఆ బాలికతో ప్రేమగా మాట్లాడారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం ఆ బాలికను దూరంగా లాగేసే ప్రయత్నం చేశారు. ఇలా బాలిక ఒక్కసారిగా సిఎం వైపు దూసుకురావడంపై కలకలం రేపడంతో పాటు చర్చనీయాంశం గా మారింది.

అయితే ఆ బాలిక చంద్రబాబు మీద అభిమానంతోనే ఆ విధంగా చేసినట్లు తరువాత విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఏదేమైనా జడ్ కేటగగిరీ సెక్యూరిటీని సునాయాసం ఒక బాలిక దాటి వచ్చి సిఎంను హత్తుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భధ్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఇటీవలే ఏవోబీలో మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో సీఎం చంద్రబాబును నక్సలైట్లు టార్గెట్ చేశారని నిఘా వర్గాలకు సమాచారం అందిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు వార్తల నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. సీఎంఎస్జీ (సీఎం సెక్యూరిటీ గ్రూప్) లో కొత్తగా 290 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిని ఇంటెలిజెన్స్ కోసం వినియోగించుకోనున్నారు. ఇందులో అడిషనల్ సూపరింటెండెంట్స్ ఐదుగురు, డిఎస్పీలు ఏడుగురు, పోలీసులు 148 ఇలా మొత్తగంగా 290ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సిబ్బంది ఇంకా అందుబాటులోకి రాకముందే ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications