ఒకే రోజు ఈ నియోజకవర్గాల్లో జగన్ బహిరంగ సభలు
YS Jagan: ఒకట్రెండు రోజుల్లో వెలువడబోయే షెడ్యూల్తో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి తెర లేవబోతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. దీనికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
సిద్ధం పేరుతో బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. అంతకుముందు భీమిలీ, దెందులూరు, రాప్తాడుల్లో ఈ సభలను నిర్వహించారు. వాటన్నింటికీ మించిపోయేలా అద్దంకి సభకు లక్షలాది మంది జనం తరలి వచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు.

దీని తరువాత వైఎస్ జగన్.. ఎన్నికల ప్రచార సభలను నిర్వహించబోతోన్నారు. ఈ నెల 16వ తేదీన తొలి సభ ఉండబోతోంది. సిద్ధం సభ తరహాలోనే ఉత్తరాంధ్రలో ఈ ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టనున్నారాయన. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఎన్నికల తొలి బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభను ఉద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు.
అదే రోజున మరో రెండు నియోజకవర్గాలు- విజయవాడ పశ్చిమం, నెల్లూరు రూరల్లల్లో కూడా జగన్ ఎన్నికల సభలు ఉండనున్నాయి. ఉదయం ఇచ్ఛాపురం, సాయంత్రం విజయవాడ పశ్చిమం, రాత్రి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఇక పోలింగ్ సమీపించేంత వరకు ప్రతి రోజూ జగన్ బహిరంగ సభలు ఉండబోతోన్నాయి. 175 నియోజకవర్గాల్లో జగన్ రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించేలా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించేలా రోడ్ మ్యాప్ను రూపొందించింది.
విస్తృతంగా జనంలోకి వెళ్లేలా ఈ సభల రూట్ మ్యాప్ ఉండబోతోంది. సార్వత్రిక ఎన్నికల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీని ఆధారంగానే వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించడానికి ఈ నెల 16వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications