టీడీపీ, బీజేపీ మధ్య చిచ్చు: మాణిక్యాలరావు Vs బాపిరాజు
అమరావతి: తాడేపల్లిగూడెంలో టీడీపీ, బీజేపీ మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ వర్గానిదే పైచేయి కావాలంటే, తమ వర్గానిదే పైచేయి కావాలంటూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. 'ఇగో' సమస్యతో సతమతమవుతున్నారు.
ఏపీ దేవాదాయశాఖ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు, టీడీపీ నేత పశ్చిమ గోదావరి జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య కొన్నాళ్లుగా ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సోమవారం వీరిద్దరూ పార్టీ శ్రేణుల సమక్షంలోనే పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు.
ఈ ఆరోపణలు మరో మంత్రి శిద్ధా రాఘవరావు సమక్షంలో జరగడం విశేషం. వివరాల్లోకి వెళితే, తాడేపల్లిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు వెళ్లారు.
అక్కడ పంచాయతీ కార్యాలయంలో వారికి అల్పాహారం ఏర్పాటు చేయగా, అదే సమయానికి జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మున్పిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. బాపిరాజు మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి ‘నమస్కారం మంత్రి గారూ మా పార్టీ వాళ్లను కాస్త చూడండి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి చాలా కష్టాలు పడ్డారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు' అని వ్యాఖ్యానించారు.
ఇటీవల ప్రత్తిపాడులో మీరు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించేందుకు వెళ్లినప్పుడు అక్కడ మా ఎంపీటీసీకి కనీస సమాచారం ఇవ్వలేదు. టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లకుండా వైసీపీ నుంచి బీజేపీలో చేరిన నేతల ఇళ్లకు వెళ్తున్నారని మంత్రిని బాపిరాజు ప్రశ్నించారు.
టీడీపీ శ్రేణులను కాకుండా వైసీపీ నుంచి వచ్చిన నేతలను మీరు వెంటేసుకుని తిరుగుతూ ప్రోత్సహిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి మాణిక్యాలరావు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకుంటున్నప్పుడు బీజేపీలో చేర్చుకుంటే తప్పేంటని మంత్రి అన్నారు.
'35 ఏళ్లు నేను కూడా ప్రజాసేవలో ఉండే రాజకీయాల్లోకి వచ్చాను. నేనేం చేయాలో మీరు చెబుతారా' అని మాణిక్యాలరావు ఘాటుగానే స్పందించారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో మంత్రి శిద్ధా కలగజేసుకుని ఇద్దరు నేతలను శాంతింప జేసినట్లు తెలుస్తోంది.